రీసర్వే 2.0లో అవకతవకలు జరిగితే చర్యలు
● కలెక్టర్ దినేష్కుమార్
● పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
పాడేరు: భూవివాదాల పరిష్కారం, శాశ్వత భూమి హక్కుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రీసర్వే 2.0లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు. మంగళ వారం ఆయన కలెక్టరేట్ నుంచి పోలవరం, అల్లూరి జిల్లాల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. సర్వే 2.0 నిర్వహణకు అన్ని మండలాల రెవెన్యూ అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సర్వే బృందాలకు మండల స్థాయిలో సమగ్ర శిక్షణ ఇవ్వాలి. ఇందులో తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. రెండు జిల్లాల్లో గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, సర్వేను అత్యంత జాగ్రత్తగా, విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యూటేషన్ల సమయంలో సర్వే బృందాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉద్యానవన పంటల సాగు పెంచాలి
పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉద్యానవన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు. ఈ రెండు జిల్లాలు ఉద్యానవన పంటలకు ఎంతో అనుకూలమైనవన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలతో భూసార పరీక్షలు నిర్వహించి, కొత్త రకం పంటలను ప్రోత్సహించాలన్నారు. కాఫీ సాగుకు అధిక ప్రాధాన్యతనిస్తూనే, అంతర పంటల సాగును పెంచాలన్నారు. అల్లం, మిరియాలు, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, లిచీ, స్ట్రాబెర్రీ, జీడిమామిడి, పైనాపిల్, సీతాఫలం, పనస, పామాయిల్ వంటి పంటల ద్వారా రైతులకు ఏడాది పొడవునా ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నందు, జిల్లా ఉద్యానవన అధికారి బాలకర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


