ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులు వైఎస్సార్ కడప జిల్లా వాసులు
కొయ్యూరు: మండలంలోని బలభద్రం గ్రామం సమీపంలోని డౌన్ వద్ద మంగళవారం సాయంత్రం ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ప్రాథమి క చికిత్స అనంతరం 108 వాహనాల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదమిలా..
వైఎస్సార్ కడప జిల్లాలోని కొత్తరెడ్డిపల్లి పంచాయతీ సరిబాల, రామాపురం మండలం గంగునాయుడు గ్రామాలకు చెందిన కొందరు కార్మికులు వాటర్ షెడ్డు పథకం కింద రాతి కట్టు పనుల కోసం కొద్దిరోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. వీరంతా మంప పంచాయతీ చిక్కుడుపాడులో నివాసం ఉంటున్నారు.మంగళవారం సాయంత్రం పనులు ముగించుకుని ఆటోలో చిక్కుడుపాడు బయలుదేరారు. డ్రైవర్ అంతిరెడ్డి శ్రీనివాస్ ఆటో నడుపుతుండగా, అతని పక్కనే కూర్చున్న సరిబాలకు చెందిన ఆంజనేయులు తాను నడుపుతానని బలవంతంగా స్టీరింగ్ తీసుకున్నాడు. తోటి కార్మికులు వద్దని వారించినా వినకుండా ఆటో నడపడంతో, డౌన్ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో స్థానికులతో కలిపి మొత్తం తొమ్మిది మంది ఉన్నారు.
క్షతగాత్రుల వివరాలు: వెంకటేష్(గంగునాయుడు గ్రామం): తల, ముక్కు
పై తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. ఆర్. రమణ, ఆర్. శంకర్, జయరామ్: వీరికి కాళ్లు విరగడంతో పాటు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆంజనేయులు (డ్రైవింగ్ చేసిన వ్యక్తి) తీవ్రంగా గాయపడ్డారు.
సహాయక చర్యలు
ప్రమాద సమాచారం అందిన వెంటనే 108 వాహనం, రాజేంద్రపాలెం పీహెచ్సీ అంబులెన్స్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు స్నేహలతా రెడ్డి, స్టాఫ్ నర్సులు ఇందిర, లావణ్య, శైలు, దేవి సత్వర చికిత్స అందించారు. మంప ఎస్ఐ సీదరి శ్రీనివాస్ ఆసుపత్రిని సందర్శించి బాధితుల వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు
ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు


