మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డగోలు అనుమతులు
ఫిర్యాదుపై 75 రోజుల తర్వాత ఎండార్స్మెంట్ దారుణం
జాయింట్ కలెక్టర్తో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న డిమాండ్
దేవరాపల్లి: దేవరాపల్లిలో అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు 75 రోజుల తర్వాత ఎండార్స్మెంట్ ఇవ్వడం అత్యంత దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవరాపల్లిలో సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. దేవరాపల్లి రెవెన్యూ పరిధిలోని బిల్లలమెట్ట సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలపై గత ఏడాది డిసెంబర్ 1న ఫిర్యాదు చేస్తే సుమారు 75 రోజుల తర్వాత దర్యాప్తు జరిపి సోమవారం తనకు ఎండార్స్మెంట్ ఇచ్చారని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమన్నారు. దేవరాపల్లిలో మూడు సర్వే నెంబర్లలో కేవలం ఏడు రోజులు మాత్రమే మట్టి తవ్వి వ్యవసాయ భూమి చదును చేసేందుకు మాత్రమే వినియోగించాలని సూచిస్తూ గత ఏడాది నవంబర్ 25న తహసీల్దార్ అనుమతులు ఇచ్చామని ఎండర్స్మెంట్లో పేర్కొన్నారని వెంకన్న తెలిపారు. సదరు మట్టి తవ్వకాలు చేపట్టిన వ్యక్తి సుమారు నెల రోజులకు పైబడి నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ వాహనాలతో రాత్రి పగలు తేడా లేకుండా రెండు కిలోమీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టారని, కానీ రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్టుగా వ్యవహరించి, అక్రమ తవ్వకాలకు పరోక్షంగా సహకరించారని విమర్శించారు. స్థానిక రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వంపై నమ్మకం పోయి, తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందన్నారు. మట్టి అక్రమ తవ్వకం, స్థానిక రెవెన్యూ అధికారుల అవినీతిపై జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


