పీఏసీఎస్ల ద్వారా యూరియా సరఫరాకు చర్యలు
కశింకోట: పీఏసీఎస్ల ద్వారా యూరియాను సరఫరా చేయడానికి మార్క్ఫెడ్ దృష్టికి తీసుకువెళ్లి చర్చించి చర్యలు తీసుకుంటామని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అన్నారు. కశింకోట, నరసింగబిల్లి పీఏసీఎస్లను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి సంఘ సభ్యుల సమస్యలు తెలుసుకున్నారు. రుణాలను ఎకరాకు రూ.5 లక్షల నుంచి అవసరాన్ని బట్టి పెంచుతామని తెలిపారు. డీసీసీబీ బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలు రూ.3 లక్షల వరకు 7 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 9.50 శాతం వడ్డీతో ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇతర బ్యాంకుల్లో రూ.50 వేల వరకు ప్రాసెసింగ్ చార్జీలు, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల రైతులు డీసీసీబీ రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో మరణించిన రైతుకు ఇచ్చే బీమా రూ.15,000 ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.50,000 కు పెంచామని తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించిన రైతుకు రూ.2 లక్షల బీమా అందిస్తున్నామని, అలాగే పీఎంఎస్బీవై పథకం కింద ఎల్ఐసీ ద్వారా మరో రూ.2 లక్షల బీమా పరిహారం అందిస్తామని తెలిపారు.


