డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు
కొయ్యూరు: వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో ప్రమాదాలు జరిగినప్పుడు బీమాతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు రావని కొయ్యూరు సీఐ బి. శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం కొయ్యూరు సంతలో మంప ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి ఆయన గిరిజనులతో మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, దీనివల్ల జరిమానాల నుంచి తప్పించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రమాద సమయాల్లో ప్రాణాలను కాపాడుతుందని వివరించారు. గంజాయి పండించినా లేదా రవాణా చేసినా జీవితాలు నాశనమవుతాయని ఆయన హెచ్చరించారు. అటువంటి కేసుల్లో చిక్కుకుంటే బెయిల్ రాక నెలల తరబడి జైలులోనే ఉండాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ.. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేస్తే ఖాతాల్లోని సొమ్ము మాయమవుతుందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహిళలపై ఎవరూ నేరాలకు పాల్పడకూడదని, ప్రస్తుతం చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని గుర్తుచేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు తమ సమస్యలను సీఐ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
క్రీడల్లో రాణించాలి
యువత క్రీడల్లో రాణించాలని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు,మంప ఎస్ఐ శ్రీనివాస్ కోరారు.బూదరాళ్ల పంచాయతీ చల్దిగెడ్డ,కొత్తపల్లి గ్రామాలకు చెందిన యువకులకు ఆదివారం వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ క్రీడల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని కోరారు.


