మాకవరంలో నేడు గంగమ్మతల్లి జాతర
ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. ప్రతి ఏటా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఈ ఉత్సవాలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ బుడియాలు. దీక్షా పరులైన వీరు కేవలం గోచీ (ప్యాటు) మాత్రమే ధరించి, శరీరంపై తెల్లటి సున్నంతో చారలు వేసుకుని వారం రోజుల పాటు మాల ధరిస్తారు. వీరు గ్రామగ్రామాన తిరుగుతూ పండుగ విశిష్టతను చాటిచెబుతారు. ఆదివారం నాడు జోలాపుట్టు, మాకవరం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో వీరు ప్రచారం నిర్వహించారు. జాతర సందర్భంగా మాకవరం గ్రామం, గంగమ్మ తల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సోమవారం రాత్రి జాతర ప్రారంభం అవుతుంది. మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు మొక్కుబడులు సమర్పిస్తారు. సరిహద్దు గ్రామాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు పులంధర్, జగత్రాయ్, గంగాధర్, పరశురాం, రఘుపతి పడాల్, ధనుంజయ్, రాజు, రాధాకృష్ణ, రామ్మూర్తి, గణపతి, నరసింగరావు పడాల్, బాబూరావు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్సవ కమిటీ


