ప్రముఖులకు ఎమ్మెల్యే కుమారుడి వివాహ ఆహ్వానం
అరకులోయ టౌన్: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తన కుమారుడు రేగం చాణక్య వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్సార్సీపీ ముఖ్య నేతలకు అందజేశారు. గత రెండు రోజులుగా విశాఖపట్నంలో పర్యటించిన ఆయన.. శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నాయకులను వారి నివాసాల్లో కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు.ఆహ్వాన పత్రికలు అందుకున్న వారిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ ఉన్నారు. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మలను కూడా ఎమ్మెల్యే కలిసి వివాహానికి ఆహ్వానించారు.వివాహ వేడుకకు తప్పకుండా హాజరై వధూవరులను ఆశీర్వదిస్తామని వారంతా హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేతెలిపారు. ఆయన వెంట అనంతగిరి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు ఉన్నారు.


