ప్రతి పౌరుడికీ ‘ఆభా’ గుర్తింపు కార్డు తప్పనిసరి
పాడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి పౌరుడు తప్పనిసరిగా 14 అంకెలతో కూడిన ఆభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) గుర్తింపు కార్డును కలిగి ఉండాలని జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ హెల్త్ ఐడీని సృష్టించుకుని, తమ ఆరోగ్య వివరాలను డిజిటలైజేషన్ చేసుకోవాలన్నారు. వైద్య సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎంతగానో దోహదపడతాయన్నారు. మొబైల్/ కంప్యూటర్ ద్వారా healthid.ndhm. gov.in వెబ్సైట్ను సందర్శించి, ఆధార్ కార్డును ఉపయోగించి సులభంగా ఆభా నంబర్ను జనరేట్ చేసు కోవచ్చని సూచించారు. ఆరోగ్య రికార్డులను డిజిటల్గా భద్రపరుచుకోవడం ద్వారా ఎక్కడి నుంచైనా వాటిని యాక్సెస్ చేయవచ్చన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఆభా నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, ఈహెచ్ఆర్ సేవలను విస్తృతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల పర్యవేక్షణ అధికారి (ఎన్హెచ్ఎం) డాక్టర్ కిరణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్వో కృష్ణమూర్తినాయక్


