బంగారు ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
నర్సీపట్నం: పట్టణంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్టు సీఐ గఫుర్ తెలిపారు. గత నెల 31న స్థానిక వెలమ వీధికి చెందిన దేవాడ త్రివేణి చోడవరంలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కింది. ఆమె వెంట సుమారు ఐదు తులాల బంగారు చైను, రెండు గాజులు, చెవిదిద్దులు బ్యాగ్లో తీసుకువెళ్లింది. ఏదో పనిపై వెళ్లిన ఆమె బస్సులోనే నర్సీపట్నం తిరిగి వచ్చింది. కాంప్లెక్స్ బయట ఆటో ఎక్కి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి సంచిలో చూసే సరికి బ్యాగ్లో ఆభరణాలు లేవు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ముగ్గురు సిబ్బందితో ప్రత్యేక పోలీసు టీమ్ ఏర్పాటు చేశారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. శుక్రవారం షేర్ఆటోలో ఇద్దురు నిందితులు తునివైపు వెళ్తుండగా పాతబస్టాండ్ వద్ద పట్టుకున్నట్టు సీఐ తెలిపారు. అనకాపల్లికి చెందిన గాడి సత్యవతి ఆలియాస్ శ్యామల, షేక్ చాన్ బాషాను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఇద్దరు నిందితులు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారని, వీరిపై కేసులు ఉన్నాయన్నారు. ఆటోను అద్దెకు తీసుకుని ఈ ఇద్దరూ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. ఆటోను సీజ్ చేశామని తెలిపారు. కేసును ఛేదించిన సిబ్బందిని సీఐ అభినందించారు.


