రేషన్ డిపో తనిఖీ
డుంబ్రిగుడ: మండలంలోని అరకుసంత రేషన్ డిపోలో నిత్యావసర సరుకుల పంపిణీ తీరుపై ఇన్చార్జి ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని ఆయన తహసీల్దార్ త్రివేణితో కలిసి స్వయంగా పరిశీలించారు. డిపోలోని స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేయడంతో పాటు, నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించారు.లబ్ధిదారులకు అందిస్తున్న సరుకుల తూకం సరిగ్గా ఉందో లేదో అడిగి తెలుసుకున్నారు.ఈ–కేవైసీ ప్రక్రియ, వేలిముద్రల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై కార్డుదారులతో మాట్లాడారు. కార్డుదారులకు కేటాయించిన సరకులలో ఎటువంటి కోత విధించకుండా పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. నిర్ణీత సమయం ప్రకారం డిపోలను తెరిచి ఉంచాలని, డిపోల వద్ద స్టాక్ వివరాలతో పాటు ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.
సరకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడినా, నిత్యావసరాలను పక్కదారి పట్టించినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సరకులు అందేలా చూడాలని తహసీల్దార్ త్రివేణికి ఆయన దిశానిర్దేశం చేశారు.


