రక్తహీనతతో ఆశ్రమ విద్యార్థినికి తీవ్ర అస్వస్థత
● స్పృహ తప్పి పడిపోవడంతో అప్రమత్తమైన హెచ్డబ్ల్యూవో గంగాభవాని
● రక్తపరీక్షల అనంతరం అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలింపు
పెదబయలు: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల–1లో బుధవారం రాత్రి ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఎన్. మహేశ్వరి రాత్రి 8.30 గంటల సమయంలో వసతి గృహంలో ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. విద్యార్థిని స్పృహ తప్పడంతో అప్రమత్తమైన పాఠశాల హెచ్డబ్ల్యూవో గంగాభవాని వెంటనే ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెకు పీహెచ్సీ వైద్యాధికారి నిఖిల్ పరీక్షలు నిర్వహించగా, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కేవలం 5.4 పాయింట్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. రక్తహీనత తీవ్రంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్లో హుటాహుటిన పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత వారం రోజులుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు హెచ్బీ, సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రక్తహీనత ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు, వారికి పౌష్టికాహారం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.
రక్తహీనతతో ఆశ్రమ విద్యార్థినికి తీవ్ర అస్వస్థత


