అవగాహనతోనే గిరి రైతులకు అధిక ఆదాయం
పాడేరు రూరల్: వ్యవసాయంపై అవగాహన పెంచుకోవడం ద్వారానే గిరిజన రైతులకు మరింత ఆదాయం లభిస్తుందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ అధికారి డాక్టర్ జి. శివనారాయణ తెలిపారు. బుధవారం పాడేరులోని ఏరువాక కేంద్రం వద్ద గిరిజన ఉప ప్రణాళిక పథకం కింద మంజూరైన ఆయిల్ మిల్లులు, సైకిల్ వీడర్లను అర్హులైన గిరిజన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ఆధునిక మెలకువలు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో విక్రయించకుండా, శుద్ధి చేసి విక్రయిస్తే గిట్టుబాటు ధరతో పాటు అధిక లాభాలు వస్తాయన్నారు. రైతులందరూ నూతన సాగు పద్ధతులను అలవాటు చేసుకున్నప్పుడే ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆయిల్ మిల్లులు, సైకిల్ వీడర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీ నోడల్ అధికారి డాక్టర్ సురేష్, ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి దేవుళ్లు పాల్గొన్నారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణాధికారి శివనారాయణ


