12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
అనకాపల్లి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న దేశవ్యాప్తంగా జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెలో ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.ఎన్ భద్రం కోరారు. మామిడిపాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో దశల వారీగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు ధారాత్తం చేయడం జరుగుతుందని, కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. కార్మికుల పోరాటాలతో సాధించుకున్న చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు కుదించడం అన్యాయమన్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్ప్లాంట్ను దశల వారీగా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం, బీఎస్ఎన్ఎల్ సంస్థను నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెల్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల బీమాను చెల్లించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మహాలక్ష్మి నాయుడు, నాయకులు అరిగా అప్పలకొండ, ఎం.కాశీఅప్పారావు, పీలా వెంకట్రావు, ఏఐటీయుసీ నాయకులు చెల్లూరి నాగరాజు, మత్తుర్తి సూరిబాబు పాల్గొన్నారు.


