ఎరువు.. మరింత బరువు! | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. మరింత బరువు!

Aug 11 2025 6:42 AM | Updated on Aug 11 2025 6:42 AM

ఎరువు

ఎరువు.. మరింత బరువు!

● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ● రెండోసారి పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ● రకాన్ని బట్టి బస్తాకు రూ.50 నుంచి రూ.330 వరకు పెరుగుదల ● సగం పెట్టుబడి ఎరువులకే వెచ్చించాల్సి వస్తోందంటున్న రైతన్నలు ● జిల్లాలో రెండు సీజన్లలో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు ● ఆందోళన చెందుతున్న రైతులు
● మొత్తం 51వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ఎరువుల వినియోగం ● ఇందులో 22 వేల మెట్రిక్‌ వరకు కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం ● జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.2.20 కోట్ల అదనపు భారం

పాత, కొత్త ధరలు ...

రూ.ల్లో(50 కిలోల బస్తా)

ఎరువు రకం పాత ధర కొత్త ధర

పొటాష్‌ 1535 1800

20–20–013(ప్యాక్డ్‌) 1300 1425

20–20–013(గ్రోమోర్‌) 1300 1350

20–20–013(పీపీఎల్‌) 1300 1400

డీఏపీ 1350 1350

10–26–26 1470 1800

14–35–14(గ్రోమోర్‌) 1700 1800

28–28–0 1700 1700

12–32–169(ఇఫ్కో) 1470 1720

16–16–16 1450 1600

15–15–15–0–9 1450 1600

16–20–0–13 1250 1300

24–24–0(మహాధన్‌) 1700 1800

20–20–013(మహాధన్‌) 1350 1450

సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ 580 640

యలమంచిలి రూరల్‌ : రాష్ట్రంలో కూటమి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులపై ఎరువుల ధరలు దరువు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు లేక పంటల సాగుపై నీలినీడలు కమ్ముకున్న సమయంలో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఎదురవుతోందని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓవైపు సాగు ఖర్చులతో పాటు పెరిగిన ఎరువుల ధరలతో రైతులు సతమతమవుతున్నారు.

బస్తాకు రూ.50 నుంచి

రూ.330 వరకూ...

జిల్లాలో ఖరీఫ్‌,రబీ సీజన్‌లలో రైతులు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తారు. వీటి కోసం సుమారుగా 51,277 మెట్రిక్‌ టన్నుల ఎరువులను వినియోగిస్తారు. వీటిలో సుమారుగా 22,000 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను పంటల సాగులో వినియోగిస్తుంటారు. ఇందులో యూరియా, డీఏపీ, 28–28–0 రకం ఎరువుల ధరలు మినహాయిస్తే మిగతా వాటి ధరలు బస్తాకు రూ.50 నుంచి రూ.330 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నారు.

రైతులపై అదనపు భారం

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 64,101 హెక్టార్లు, రబీలో 16,011 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. దీనిలో సింహభాగం వరి సాగవుతోంది. ఈ పంటల సాగుకోసం సుమారుగా 51,277 మెట్రిక్‌ టన్నుల ఎరువులను వినియోగిస్తారని వ్యవసాయాధికారుల అంచనా. వీటిలో సుమారు 22 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం ఉంటుంది. ఒక యూరియా బస్తా 50 కేజీలు బరువు ఉంటుంది. సరాసరిన బస్తాకు రూ.100 చొప్పున పెరిగిన ధరను లెక్కిస్తే జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.2.20 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. అమాంతం పెరిగిన ధరలతో ఆశించిన దిగుబడులు రాక,సాగు వ్యయం తడిసిమోపెడవడంతో ఆశించిన లాభం రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. వారికి అప్పులే మిగులుతున్నాయి.

నియంత్రణ లేని ధరలు

యూరియాపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉంది. కాంప్లెక్స్‌ ఎరువుల విషయంలో నియంత్రణ లేకపోవడంతో ఆయా కంపెనీలు తయారీ ఖర్చుల ఆధారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఫాస్ఫరస్‌, పొటాష్‌ ధరల పెరుగుదలతో కాంప్లెక్స్‌(మిశ్రమ) ఎరువుల తయారీ ధరలు పెరిగాయి. ఎరువుల ఉత్పత్తికి వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడంతో ఎరువుల ధరలు పెరిగినట్టు డీలర్లు చెబుతున్నారు. దీంతో పంటల సాగు ఖర్చు ఎకరాకు రూ.2 వేల వరకు పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. సాగుకయ్యే ఖర్చులో సగం పెట్టుబడి ఎరువులకే వెచ్చించాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు.

అన్నదాతలకు పిడుగులాంటి వార్త. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో వరుసగా రెండోసారి ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే కష్టాలు, నష్టాలు మోస్తూ ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు ఎరువుల రూపంలో మరోసారి అదనపు భారం పడుతోంది. పెరిగిన ధరలతో జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.2.20 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది.

ఇంత ఖర్చుతో సాగు ఎలా..?

పెట్టుబడి ఖర్చులతో వ్యవసాయం భారంగా మారిన తరుణంలో ప్రభుత్వాలు ఇలా ఎరువుల ధరలు పెంచడం దారుణం. ధరల పెరుగుదల గుదిబండగా మారింది. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల మేం వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో మా ప్రాంతంలో రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోతే అప్పుల పాలుకాక తప్పదు.

– కాళ్ల శ్రీనివాసరావు, రైతు, పోతురెడ్డిపాలెం, యలమంచిలి మండలం

మోయలేని భారం

అసలే సాగు పెట్టుబడులు పెరిగి వ్యవసాయం అంటేనే భయపడుతున్న తరుణంలో ఎరువుల ధరలు పెంచడం దారుణం. వీటిని నియంత్రించాలి. పెరిగిన ధరలతో సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి వచ్చింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే పెరిగిన ఎరువుల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.

– కర్రి అప్పారావు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు

ఎరువు.. మరింత బరువు!1
1/3

ఎరువు.. మరింత బరువు!

ఎరువు.. మరింత బరువు!2
2/3

ఎరువు.. మరింత బరువు!

ఎరువు.. మరింత బరువు!3
3/3

ఎరువు.. మరింత బరువు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement