
ఆహ్వానించి అవమానపరిచారు
రాజవొమ్మంగి: జల్జీవన్ మిషన్ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించి అవమానపరచారని, మండలంలోని వాతంగి పంచాయతీ సర్పంచ్ భీంరెడ్డి శుభలక్ష్మి వాపోయారు. వాతంగి పంచాయతీ పెదగర్రంగిలో రూ.14 లక్షలతో చేపట్టనున్న జేజేఎం పథకం పనులను ఎమ్మెల్యే శిరిషాదేవి శంకుస్థాపన చేశారు. కాగా ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 4 గంటలకు హాజరుకావాలని సర్పంచ్, వైస్ ఎంపీపీలను అధికారులు ఆహ్వానించారు. ఆ గ్రామానికి మేము 3.30 నిమిషాలకే వెళ్లామని, అయితే అప్పటికే అధికారులు, ఎమ్మెల్యే కార్యక్రమాలు ముగించుకొని వెళ్లిపోయారని సర్పంచ్ శుభలక్ష్మి, వైస్ ఎంపీపీ రాజేశ్వరి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఆహ్వానించి, తమను కించపరిచారన్నారు. దీనిపై కలెక్టర్ దినేష్కుమార్కు ఫిర్యాదు చేస్తామన్నారు.