
జాతరలో ముమ్మర ఏర్పాట్లు
చింతపల్లి: చింతపల్లిలో ముత్యాలమ్మతల్లి జాతర సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి అమ్మవారి వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా స్థానిక ఆర్అండ్బీ కార్యాలయం ప్రాంగణంలో వైద్యశాఖ, ఐసిడిఎస్,గిరిజన సహకార సంస్థ,వ్యవసాయ,ఉద్యాన శాఖలు,పశుసంవర్ధక, ఉపాధి హామీ పథకం, వెలుగు, మరియు పంచాయితీ అద్వర్యంలో విద్యుత్ వ్యర్థాల సేకరణ స్టాల్స్ను ఆయా శాఖలు అధికారులు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో ముత్యాలమ్మ జాతర సందర్భంగా నీటి సమస్య తలెత్తకుండా పలుచోట్ల తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా 50 మంది అదనపు కార్మికులను ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.
వాహనాల దారి మళ్లింపు
ముత్యాలమ్మతల్లి జాతర సందర్భంగా మండల కేంద్రానికి చేరుకునే వాహనాలను దారి మళ్లించే విధంగా పోలీసు చర్యలు చేపట్టారు. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆదేశాల మేరకు సీఐ వినోద్బాబు ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. చింతపల్లికి నర్సీపట్నం నుంచి వచ్చే వాహనాలను స్థానిక ఏపీఆర్ కళాశాల నుంచి జీకే వీధి, కేడి పేట నుంచి వచ్చే వాహనాలను జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద, పాడేరు జెర్రెల నుంచి వచ్చే వాహనాలను డిగ్రీ కళాశాల నుంచి దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ నాలుగు రోజుల పాటు చింతపల్లి ప్రాంతమంతా పోలీసు బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు సీఐ వినోద్బాబు తెలిపారు.

జాతరలో ముమ్మర ఏర్పాట్లు