వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం బాధ్యతారాహిత్యం | - | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం బాధ్యతారాహిత్యం

Apr 22 2025 2:34 AM | Updated on Apr 22 2025 2:34 AM

వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం బాధ్యతారాహిత్యం

వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం బాధ్యతారాహిత్యం

● ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్‌

డాబాగార్డెన్స్‌: ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్‌ అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగం..మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ అనే అంశంపై డాక్టర్‌ హరిప్రసాద్‌ స్మారక ఉపన్యాం నిర్వహించారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పులు రావడం లేదని, ప్రైవేట్‌ రంగానికి వైద్యం అప్పగించడం ఆందోళనకరమన్నారు. కేరళ ఆరోగ్య రంగంలో ఆదర్శంగా ఉందని, అక్కడ మరణాల రేటు తక్కువగా, వైద్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని, పీపీపీ పద్ధతిలో మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేయడం, క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేయడం సమర్థనీయం కాదన్నారు. ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేట్‌ కళాశాలల సంఖ్య ఎక్కువగా ఉండటం దారుణమన్నారు. వైద్య విద్యా మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సత్య వరప్రసాద్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ వైద్యం పరీక్షల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. ఐదు జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూలు లేవని, వైద్యరంగంలో సేవా దృక్పథం తగ్గి వ్యాపార కాంక్ష పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ జరిగితే ఫీజులు పెరిగిపోతాయని, రిజర్వేషన్లు తగ్గిపోతాయని, పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండదని డాక్టర్‌ ఎంవీ రమణయ్య అన్నారు. రాష్ట్రంలో మల్టీపర్పస్‌ అసిస్టెంట్‌ పోస్టులు, జనరల్‌ మెడిసిన్‌ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ప్రతినిది, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement