గత ప్రభుత్వ ప్రాజెక్టులా.. ఆపేయ్‌.! | - | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వ ప్రాజెక్టులా.. ఆపేయ్‌.!

Apr 21 2025 7:55 AM | Updated on Apr 21 2025 7:55 AM

గత ప్

గత ప్రభుత్వ ప్రాజెక్టులా.. ఆపేయ్‌.!

● అభివృద్ధికి శాపం.. కూటమి పాలన

● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వంతెనలను పూర్తి చేయని వైనం

● వంతెనల అప్రోచ్‌ రోడ్లకు నిధుల్లేక నిలిచిపోయిన పనులు

సీలేరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన పలు ప్రాజెక్టులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గిరిజనుల సౌకర్యార్థం మంజూరు చేసిన వంతెనల నిర్మాణంపై కక్ష ధోరణి ప్రదర్శిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం నుంచి గిరిజన గ్రామాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు ప్రధాన వంతెనలు మంజూరయ్యాయి. కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ వంతెనలను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆయా గెడ్డలు, వాగుల్లో ఉధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

పూర్తి కాని పిల్లి గెడ్డ వంతెన

రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు సీలేరు సమీప పిల్లి గెడ్డ వద్ద ఎన్నో ఏళ్లుగా రాకపోకలు కష్టంగా ఉండేది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.2.34 కోట్లు మంజూరు చేసి వంతెన పనులు ప్రారంభించింది. వంతెన నిర్మాణం పూర్తయింది. రెండు వైపులా అప్రోచ్‌ రోడ్డు పూర్తి కాకుండా గడిచిన 7 నెలలుగా పనులు నిలిచిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో భారీ విపత్తు వచ్చి వర్షానికి పిల్లి గెడ్డ వంతెన అప్రోచ్‌ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రెండు వైపులా వాలు కట్టేందుకు రూ.30 లక్షలతో ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు.

కొట్టుకుపోయిన చిన్న గంగవరం వంతెన

అల్లూరు జిల్లా నుంచి గూడెం కొత్తవీధి మండలం దాటి దారకొండ మీదుగా ఒడిశా వెళ్లేందుకు చిన్న గంగవరం వంతెన కీలకం. 2014 ఏడాదిలో రూ.40 లక్షలతో ఈ వంతెనను నిర్మించారు. చుట్టు పక్కల అటవీ ప్రాంతం నుంచి పడిన వర్షపు నీరు అంతా ఈ వంతెన మీదుగా ప్రవహిస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో భారీ తుపాను వచ్చి వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. వెంటనే భారీ వంతెన నిర్మించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇటీవల ఆ ప్రాంత గ్రామ గిరిజనులు వంతెన నిర్మించాలని పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. నెల రోజుల కిందట ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు వంతెన పరిశీలించి తక్షణమే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. వర్షాలు పడితే పూర్తిగా సరిహద్దుకు రాకపోకలు నిలిచిపోతాయని, నిత్యావసర సరకులు కూడా తెచ్చుకోలేమని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

అస్తవ్యస్తంగా మాదిగ మల్లు అప్రోచ్‌ రోడ్డు

జిల్లా నుంచి ధారకొండ మీదుగా తూర్పుగోదావరి, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వెళ్లేందుకు గుమ్మురేవులు రోడ్డు మార్గం మధ్యలో మాదిగ మల్లు వంతెన కీలకం. ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో భారీగా కురిసే వర్షపు నీరంతా ఈ వంతెన నుంచే ప్రవహిస్తోంది. దీంతో గత ప్రభుత్వం రెండు కోట్ల 40 లక్షల రూపాయలతో భారీ వంతెనను మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేసింది. ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం అప్రోచ్‌ రోడ్డును ఇప్పటికీ పూర్తి చేయలేదు. గతేడాది తొమ్మిదో నెలలో వచ్చిన భారీ వర్షానికి కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా నిర్మించి రాకపోకలు సాగించారు. అప్పటి నుంచి అసంపూర్తిగానే వంతెన ఉంది. తరచూ కురుస్తున్న వర్షాలకు అప్రోచ్‌ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. మూడు రోజుల కిందట ఆర్టీసీ బస్సు వర్షానికి బురదలో కూరుకుపోయింది. రెండు వైపులా అప్రోచ్‌ రోడ్డు వేసేందుకు రూ.1.80 కోట్లతో జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతులు ఎట్టకేలకు వచ్చాయి. దీంతో టెండర్లు పిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల రోజుల్లో పనులు జరగకపోతే రానున్న వర్షాకాలంలో ఈ వంతెనపై కూడా రాకపోకలు కష్టమేనని ఆ ప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ పనుల్లో సప్పర్ల వంతెన

సప్పర్ల నుంచి గొల్లపల్లి వెళ్లే మార్గంలో పెద్ద వాగు ఉంది. వర్షాకాలంలో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రెండు కోట్ల 80 లక్షల రూపాయలతో వంతెన మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ వంతెన పూర్తయితే అవతల ఉన్న గ్రామాల నుంచి పండించిన పంటలు తరలించడానికి సులువవుతుంది.

అప్రోచ్‌ రోడ్లు పూర్తి చేయాలి

వంతెనలకు ఇరువైపులా చేపట్టాల్సిన అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం తక్షణం పూర్తి చేయాలి. లేకపోతే ఆందోళన చేస్తాం. వర్షా కాలం ప్రారంభమైతే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. తక్షణం నిర్మాణాలు పూర్తి చేయాలి.

– కారే శ్రీనివాస్‌, స్థానిక నాయకుడు

అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం..

పిల్లిగెడ్డ, మాదిగ మల్లు, సప్పర్ల వంతెనలకు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం. మాదిగ మల్లు వంతెన వద్ద అప్రోచ్‌ రోడ్డుకు కలెక్టర్‌ రూ.1.80 కోట్లతో అనుమతులు ఇచ్చారు. త్వరలోనే పనులు చేపడతాం.

– కళ్యాణ్‌ కుమార్‌, డీఈ, ట్రైబల్‌ వెల్ఫేర్‌

గత ప్రభుత్వ ప్రాజెక్టులా.. ఆపేయ్‌.! 1
1/2

గత ప్రభుత్వ ప్రాజెక్టులా.. ఆపేయ్‌.!

గత ప్రభుత్వ ప్రాజెక్టులా.. ఆపేయ్‌.! 2
2/2

గత ప్రభుత్వ ప్రాజెక్టులా.. ఆపేయ్‌.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement