ఆదిలాబాద్టౌన్: ఆదివాసీలు అత్యధికంగా కలిగిన జిల్లాలో ఉన్నత విద్య పరంగా అవకాశాలు మెరుగుపర్చేందుకు తోడ్పడే యూనివర్సిటీ లేకపోవడం అవరోధంగా నిలుస్తోంది. గతంలో జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరైనా మరో జిల్లాకు తరలిపోయిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారసభతో పాటు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభలోనూ వర్సిటీ ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేశారు. దీంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమైంది. అయితే నెలలు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ సీఎంను గురువారం హైదరాబాద్లో కలిసి విన్నవించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు తమ ఆకాంక్ష త్వరలోనే నెరవేరనుందనే ఆశాభావం ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు సైతం చొరవ చూపితే త్వరితగతిన కల సాకారమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
కజ్జర్లలో అనువైన స్థలం..
వర్సిటీకి అవసరమైన అనువైన స్థలాన్ని సైతం అధికార పార్టీ నేతలు గుర్తించారు. జిల్లా కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తలమడుగు మండలంలోని కజ్జర్లలో వందల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ సీఎంను కలిసి మరోసారి కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు మరికొన్ని అంశాలపై కూడా సీఎం సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
ప్రాధాన్యతను చాటిన ‘సాక్షి’
వర్సిటీ లేని ఏకై క ఉమ్మడి జిల్లాగా నిలిచిన ఆది లాబాద్లో విశ్వవిద్యాలయ ఆవశ్యకతను వివరి స్తూ ‘సాక్షి’ చొరవ చూపింది. ప్రత్యేక కథనాల ద్వారా ఈ ప్రాంతానికి ఒనగూరే ప్రయోజనాల ను వివరించింది. తొలుత గతేడాది విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, అధ్యాపకులతో చర్చావేదిక ఏర్పాటు చేసింది. ఆ వేదికపైనే వర్సిటీ సాధన కమిటీ ఆవిర్భవించింది. వెంటనే కమిటీ కార్యాచరణ సైతం ప్రకటించి ముందడుగు వేసింది. జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలలను సందర్శించి వర్సిటీ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించింది. వారిని ఉద్యమంలో భాగస్వాములను చేసింది. ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించింది. త్వరలోనే గవర్నర్ను కలిసేందుకు కమిటీ పక్షాన సన్నద్ధమవుతున్నారు.


