తలమడుగు: గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని కజ్జర్ల గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సమస్యల పరిష్కారంలో ఎక్కడైనా జాప్యం జరిగితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. తోటరాణి–శ్రీధర్ దంపతులు ఏర్పాటు చేసిన ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రాన్ని సందర్శించారు. సహజసిద్ధ యూనిట్లకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. అనంతరం పల్సి (కె) గ్రామంలో పర్యటించారు. డిజిటల్ క్రాప్ సర్వే, డ్రోన్ ద్వారా పత్తి చేనులో పురుగుమందు పిచికారీని పరిశీలించారు.ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన గ్రామస్తుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. నిరుద్యోగ యువత అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ను పరిశీలించి, నిర్వహణపై సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, తహసీల్దార్ రాజ్మోహన్, ఎంపీడీవో శంకర్, కజ్జర్ల సర్పంచ్ నారాయణరెడ్డి, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉత్పల్ కుమార్, కేవీకే సీనియర్ సైంటిస్ట్ ఎన్.రామగోపాల్ వర్మ, పల్సి కే సర్పంచ్ చిన్ను, విశ్వామిత్ర, విశ్వనాథ్, కేవీ కే శాస్త్రవేత్తలు రఘువీర్, సురేష్, మండల వ్యవసా య అధికారి ప్రమోద్రెడ్డి, ఉప సర్పంచ్ గంగన్న, ఏపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


