ఇంద్రవెల్లి: నాగోబా ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కేస్లాగూడ గ్రామాన్ని సందర్శించారు. పాఠశాలలో నిర్మించిన ప్రహరీని ప్రారంభిచారు. అనంతరం నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో రూ.కోటితో చేపట్టిన గెస్ట్హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు వంట గదులు, డైనింగ్ హాల్, వీఐపీ గెస్ట్ హౌస్, ట్రైబల్ మ్యూజియం, పూరి.. మెస్రం వంశీయులకు విశ్రాంతి కోసం గెస్ట్ హౌస్, కోనేరు సుందరీకరణ, మెస్రం వంశీయులు, భక్తుల కోసం నాలుగు సులభ్ కాంప్లెక్స్లు, తాగునీటి సౌకర్యం, ఓహెచ్ఆర్ ట్యాంక్ నిర్మాణంతో పాటుగ్రామానికి అనుబంధంగా ఉన్న గ్రామాల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించి గడువులోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, సర్పంచ్ మెస్రం తుకారాం, ఐటీడీఏ ఈఈ తానాజీ, మెస్రం వంశీయులు మెస్రం నాగ్నాథ్, ఆనంద్రావ్, శేఖర్బాబు, పార్టీ నాయకులున్నారు.


