బజార్హత్నూర్: నా పేరు నారడి మల్లయ్య, వయస్సు 95. 1947 ఆగస్టు 15రోజు నా వయస్సు 16 సంవత్సరాలు. అప్పుడు మా మండలం మొత్తం దొరల పాలనలో ఉండేది. పల్సికార్ రంగారావ్(పల్సి దొర) బజార్హత్నూర్ వతందార్. దొర ఇంట్లో తప్ప మా గ్రామంలో కరెంటు లేదు. ఆ రోజు అర్ధరాత్రి రేడియోలో బ్రిటీష్ వాళ్లు మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారని నెహ్రూ ప్రసంగం విన్నారు. తెల్లవారుజాము నుంచే గ్రామంలో కోలాహలం ఉండే. పల్సికార్ రంగారావ్ ఆధ్వర్యంలో దొడ్డి మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేను మా నాన్న మల్లన్నతో కలిసి మా గ్రామంలో స్వతంత్ర దినోత్సవం సంబరాల కార్యక్రమానికి వెళ్లాను. డప్పులతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. భారతమాతకి జై, వందేమాతరం నినాదాలు చేశారు. తర్వాత అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు.
– నారడి మల్లయ్య, బజార్హత్నూర్


