బోథ్: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రానికి చెందిన బాశెట్టి రాజ్కుమార్ రూపాయి పరిణామ క్రమాన్ని సజీవంగా కళ్ల ముందుంచుతున్నారు. దేశభక్తి, ప్రాచీన సంస్కృతిపై మక్కువతో నాణేలు సేకరించి శతాబ్దాల నాటి చరిత్రను నిక్షిప్తం చేస్తున్నారు. దాదాపు ఆరు శతాబ్దాల కిందటి దక్కన్ బహుమనీ సుల్తానుల రాగి కాసులు, హైదరాబాద్ నిజాం సంస్థానపు హాలీ సిక్కా నాణేలతో పాటు స్వాతంత్య్ర పోరాట కాలానికి చెందిన ఎన్నో విశిష్ట నాణేలు సేకరిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ తీవ్రతతో లోహాల కొరత ఏర్పడినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తక్కువ లోహంతో ముద్రించిన 1945 నాటి మధ్యలో రంధ్రం గల పైసా నాణెం నాటి యుద్ధ సంక్షోభ పరిస్థితులను కళ్లకు కడుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గతకాలపు జ్ఞాపకాలు, నాటి కరెన్సీ చరిత్రను పదిలపరుస్తున్న రాజ్కుమార్ను చరిత్రకారులు ప్రశంసిస్తున్నారు.


