ఒంగోలు టౌన్: స్థానిక కేశవరాజుకుంటలో బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. వ్యక్తిగత పనుల నిమిత్తం కుటుంబంతో కలిసి ఊరెళ్లి శుక్రవారం తెల్లవారుజామున తిరిగి ఒంగోలు చేరుకున్నాడు. ఇంటికి రాగానే తలుపులు పగులగొట్టి ఉండటంతో లోపలకు వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలున్న దుస్తులు చిందరవందరగా బయట పడేసి ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు సవర్ల బంగారు నగలు, రూ.32 వేల నగదు తీసుకెళ్లినట్లు గుర్తించి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంతనూతలపాడు: సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామంలో గృహాల సమీపంలో ఎయిర్టెల్ టవర్ నిర్మాణం చేపట్టడాన్ని స్థానిక మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలు ఈ నిర్మాణం తమకు అనారోగ్య సమస్యలు కలిగిస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్ల పరిసరాల్లో టవర్ నిర్మాణం చేయడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుందని, చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రమాదం ఉంటుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీ అనుమతులు లేకుండానే కొంతమంది స్థానిక నేతల సహకారంతో నిర్వాహకులు టవర్ నిర్మాణాన్ని ప్రారంభించారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వెంటనే అధికారులు స్పందించి టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
సంతనూతలపాడు: దోమల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని జిల్లా మలేరియా ఆఫీసర్ రమేష్ బాబు సూచించారు. శుక్రవారం సంతనూతలపాడు మండలంలో ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పీహెచ్సీలో వైద్యురాలు మానస ఆధ్వర్యంలో ఫ్రై డే.. డ్రై డేతో పాటు డెంగీ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దోమలు పుట్టకూడదు, కుట్టకూడదు అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇళ్లు, పరిసరాలలో నీరు నిల్వ లేకుండా, దోమలు ఉత్పత్తి కాకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ పి.శ్రీనివాసరావు, డాక్టర్ జె.నాగరాజు, ఎంపీహెచ్ఈఓ మాధవరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


