ఆదిలాబాద్టౌన్: ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ ను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని రిక్షా కాలనీ, పోలీస్ కాలనీ, టైలర్ కాలనీల్లో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ఓటరు వివరా ల డిజిటలైజేషన్ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్ పనుల తీరును బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతిఒక్కరి వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడి పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా శ్రద్ధ వహించాలని అన్నారు. పోలీస్ కాలనీలో ఆశా కార్యకర్త ద్వారా ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆదిలాబాద్, మావల తహసీల్దార్లు శ్రీనివాస్, వేణు, సూపర్వైజర్లు అంకిత్రెడ్డి, శ్రీధర్, బీఎల్వో లు విఠాబాయి, మీనాక్షి, ఇతర సిబ్బంది ఉన్నారు.
కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులే నివసించాలి
కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులే నివసించాలని, వాటిని అద్దెకు ఇవ్వడం, విక్రయించడం వంటివి చేస్తే రద్దు చేస్తామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో 6 నుంచి 16 వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు రశీదులను మున్సిపల్ చైర్పర్సన్ అనూషతో కలిసి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులను వార్డుల వారీగా పూర్తి పారదర్శకతతో లక్కీడ్రా విధానంలో ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, కేటాయించిన ఇళ్లను పరిశుభ్రంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. త్వరలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అధికారిక ప్రొసీడింగ్స్ కాపీలను అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్, హౌసింగ్శాఖల అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులు పరిశీలన
తాంసి: జిల్లా కేంద్రంలోని హరిఓం నగర్ కాలనీలో చేపడుతున్న వంతెన నిర్మాణ పనులను కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు. త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మైనార్టీల సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనార్టీల సంక్షేమం, వారి సమస్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మైనార్టీ వర్గాల ప్రతినిధులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, నిధులు, విధానపరమైన నిర్ణయాలు అవసరమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్ కలీమ్, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్ గౌడ్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యువతకు మార్గదర్శిగా ‘ఎచీవర్స్
డాక్యుమెంట్స్’
తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఎచీవర్స్ డాక్యుమెంట్స్’ యువతకు మార్గదర్శిగా నిలుస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్–ఎచీవర్స్ డాక్యుమెంట్స్’ పుస్తకాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, మార్గదర్శక సమాచారం యువతకు పోటీ పరీక్షల్లో రాణించేందుకు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.


