గంజాయి రహిత జిల్లా లక్ష్యం
ఇంద్రవెల్లి: గంజాయి, మాదక ద్రవ్యాల రహిత జిల్లా లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈమేరకు అందరూ సహకరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని దనోరా(బి) గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పోలీసులు మీ కోసం కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి సాగు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం, సేవించడం వంటివి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా సంబంధిత శాఖలకు సిఫారసు చేస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం వాలీబాల్ టోర్నీలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, సర్పంచ్ జాదవ్ జముననాయక్, ఉపసర్పంచ్ కరీంలాల, గ్రామస్తులు పాల్గొన్నారు.
హైవేపై భారీ వాహనాలు పార్కింగ్ చేయొద్దు
గుడిహత్నూర్: దాబాల సమీపంలోని జాతీయ, అంతర్రాష్ట్ర రహదారుల పక్కన వాహనాల పార్కింగ్ బాధ్యత ఆయా నిర్వాహకులదే అని ఎస్పీ స్పష్టం చేశారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ఓ దాబా వద్ద జిల్లాలోని ఆయా దాబాల నిర్వాహకులతో సమావేశం అయ్యారు. రహదారి ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా రహదారులపై వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలన్నారు. అలాగే దాబాలలో మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు వంటివి విక్రయిస్తే కేసుల నమోదుతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతీ దాబా వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, ఇచ్చోడ, గుడిహత్నూర్ ఎస్హెచ్వోలు నరేష్కుమార్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


