మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ పరిధి గుడిపేట శివారులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మిట్టపల్లి మల్లేశ్(57) మృత్యువాతపడ్డాడు. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. మంచిర్యాల ఏసీసీలో నివాసం ఉంటున్న మల్లేశ్ తన ద్విచక్ర వాహనంపై లక్సెట్టిపేట పరిధిలోని గుల్లకోటలో ఉన్న ఓ సిరామిక్స్ కంపెనీకి వెళ్లాడు. వెల్డింగ్ పని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. గుడిపేట శివారులో లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల వైపు వస్తున్న లారీని డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి లక్ష్మణ్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో లక్ష్మణ్ తన వాహనంతో సహా లారీ ముందు బంపర్లో ఇరుక్కుపోయాడు. చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలతో మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమారులు శామ్యూల్ రాజ్కుమార్, సాల్మన్రాజ్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పదంగా ఒకరు..
బాసర: మండలంలోని అష్ట గ్రామానికి చెందిన కనకాపురం లింగం (40) మంగళవారం బాసర నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా బాసర ఓని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ దీపక్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా మృతునిపై బైక్ పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని తల్లి కనకాపురం పోసాని ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
హోంగార్డు మృతి
బాసర: జ్ఞాన సరస్వతి దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ హోంగార్డ్ పెరిక రాజన్న మంగళవారం మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన అతడు గత ఏడాదిగా క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విధులకు దూరంగా ఉన్నాడు. అప్పులు చేసి చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయిందని భార్య గౌరమ్మ తెలిపింది. కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతోంది. రాజన్నకు భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.


