నియోజకవర్గాల్లో ముదిరిన వివాదం బహిర్గతమవుతున్న విభేదాలు ‘నామినేటెడ్’ కోసం ఎవరికివారే జాబితాలు అయోమయంలో కార్యకర్తలు
సాక్షి,ఆదిలాబాద్: ‘మన పార్టీలో కొంతమంది ము ఖ్య నాయకులు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెదులుతున్నారు.. ఇండ్ల పట్టాలు కూడా ఆ ఎమ్మెల్యే చొరవతోనే సాధ్యమైందని బహిరంగంగా చెబుతున్నారు.. జొన్నల కొనుగోలులో కూడా ఎ మ్మెల్యేదే పాత్ర అని అంటున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరు చెప్పాలి.. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి సారథ్యంలో ఇవి జరిగాయని పేర్కొనాలి.. వాస్తవంగా జరిగింది కూడా అదే.. కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను పొగడడం ఏవిధంగా సబబంటూ..’ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఓ బహిరంగ వేదికపై ఆదివారం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓటరు సవరణ ‘సర్’ కార్యక్రమానికి సంబంధించి కార్యకర్తలతో తలమడుగు మండలం భరంపూర్లో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఆరెపల్లి మోహన్ సమక్షంలోనే ఇది జరగడం గమనార్హం. హస్తం పార్టీలో వర్గపోరు తీవ్రతకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ముఖ్య నేతల మధ్య మళ్లీ విభేదాలు తీవ్రమయ్యాయనే చర్చ పార్టీలో సాగుతుంది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య పోరు ఇటీవల ముదిరి పాకాన పడ్డాయని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పార్టీలో అంతా అయోమయం నెలకొందని వారు అభిప్రాయ పడుతున్నారు.
ఎవరికి వారే..
సహకార సంఘాల నామినేటెడ్ కమిటీల ఏర్పాటు కోసం ప్రభుత్వం పరిశీలన చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోనూ పలువురు ఈ పదవుల కోసం ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్య నేతల మధ్య విభేదాల కారణంగా ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని పార్టీలో కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఎవరికి వారే జాబితాలు పార్టీ రాష్ట్ర నాయకులకు, జిల్లా ఇన్చార్జి మంత్రికి అందజేస్తుండటం తలనొప్పిగా మారిందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాల అమల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చర్చించుకుంటున్నారు. వీరి మధ్య వైరంతో అర్హులైన వారికి పథకాలు దక్కుతాయో.. లేదోననే సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు.


