ఒంగోలు వన్టౌన్: కారంచేడు ఉద్యమ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ దళిత అణచివేత విధానాలను ఎదుర్కోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని నీలంపాలెంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం కారంచేడు మృతవీరుల 41వ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవ పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు, చట్టాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. 1985 జూలై 17న కారంచేడు మాదిగ పల్లైపె కమ్మ భూస్వాములు నరమేధం సృష్టించారన్నారు. కారంచేడు మాదిగ బాధితులను చీరాల మాల పేటలన్నీ అక్కున చేర్చుకుని పూటకో పేట అనే నినాదంతో అన్నం పెట్టి ఆదుకున్నారన్నారు. దీంతో కారంచేడు దళిత ఉద్యమం నిర్వహించి దళితులు పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు బీఎన్ఎస్ 35 పేరుతో స్టేషన్ బెయిల్ ఇచ్చి అగ్రకుల ముద్దాయిలకు కూటమి ప్రభుత్వం గొడుగు పడుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి సబ్సిడీ కూడా విడుదల చేయడం లేదన్నారు. దళితులకు శ్మశాన భూములు కూడా ఇవ్వడం లేదన్నారు. మాలమాదిగలు కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కారంచేడు ఉద్యమ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ అగ్రకుల అరాచక విధానాలకు వ్యతిరేకంగా దళిత హక్కులకై పోరాడాలని నాగేంద్రరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, మాదిగ పరిరక్షణ సమితి కన్వీనర్ పట్రా బంగారం, మాల సభ కన్వీనర్ మేడికొండ మురళి, దేవరపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.
కారంచేడు ఉద్యమ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలి
దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగేంద్రరావు


