ఆదిలాబాద్టౌన్: సీసీఐ పునరుద్ధరణపై ఆగస్టు 31లోపు స్పష్టత రాకపోతే ఆమరణ దీక్ష చేపడతానని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీసీ ఐ పునరుద్ధరణ కోసం అవసరమైతే తన ప్రాణా లను సైతం లెక్కచేయనని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. చట్టవిరుద్ధంగా స్క్రాప్ టెండర్లు పిలిచారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అలాంటి టెండర్లు జరగకుండా తాము కోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజా సమస్యలను విస్మరించి కమీషన్లు వచ్చే పనులపైనే స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించారని విమర్శించారు. ఏటా 5వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇండస్ట్రీయల్ కారిడార్పై చూపుతున్న శ్రద్ధను సీసీఐ పునరుద్ధరణపై ఎందుకు చూపడం లేదని నిలదీశారు. ఇది ప్రజలను పక్కదారి పట్టించే ప్ర యత్నమేనని విమర్శించారు. సీసీఐ పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆగస్టు 31 నుంచి ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలి
ఆదిలాబాద్టౌన్: సీసీఐ పునఃప్రారంభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి అనుమతులు మంజూరు చేయాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 15న కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న నాయకత్వంలో సీసీఐ సాధన కమిటీ ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి, సీసీఐ సీఎండీ సంజయ్ బంగాను కలిసి పరిశ్రమ పునఃప్రారంభంపై చర్చించినట్లు తెలిపారు. పరిశ్రమను తిరిగి ప్రా రంభించేందుకు సుమారు రూ.2వేల కోట్లు అవసరమని, అందులో కేంద్రం రూ.250 కోట్లు, రా ష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు అందిస్తే, మిగిలిన రూ.1,500 కోట్లను సంస్థ రుణంగా సమీకరించేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అవసరమైన అనుమతులు, ఆర్థిక సహకారం అందించాలన్నారు. ఈవిషయమై త్వరలోనే సీఎంను కూడా కలిసి సమస్యను వివరించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సాధన కమిటీ కోకన్వీనర్లు నారాయణ, రమేశ్, వెంకట్ నారాయణ, జగన్ సింగ్, పోశెట్టి, దత్తాత్రి, ఈశ్వర్ దాస్, అరుణ్కుమార్, దేవిదాస్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.


