బజార్హత్నూర్: రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా భూముల రీసర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మండలంలోని గంగాపూర్, రాంపూర్, దాబాడి, మోహద గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దాదాపు 90ఏళ్ల తర్వాత భూముల రీసర్వే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో తొలి విడతలో 70 గ్రామాల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తయితే పట్టాదారుల భూములకు పూర్తి భద్రత ఏర్పడుతుందని తెలి పారు. అనంతరం అటవీ ప్రాంతంలో గల డేడ్రా, మాన్కపూర్ గ్రామాల్లో పర్యటించారు. అటవీశాఖ అనుమతులు లభించినందున రోడ్డు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటివి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మాన్కపూర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలకు ఏడీ ప్రభాకర్ స్మార్ట్టీవీని కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధ్యాయులకు అందజేశారు. ఇందులో తహసీల్దార్ శ్యాంసుందర్, సర్పంచ్లు సుభాష్, సాయన్న, అరవింద్, అనిల్, విజయ, ఉపసర్పంచ్ పాల్వే మారుతి, ఏవో ఎండీ సౌద్, ఏఈవో ప్రవీణ్, ఆర్ఐ నూర్పింగ్, సర్వేయర్ బాపురావ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, జల సంరక్షణ, న్యూట్రీ గార్డెన్స్తో పాటు పలు ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అర్హులందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ‘జలసిరి–జల్ సంచయ్ జన్ భాగీదారి’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా నిర్వహించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోషకాహార భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ స్థలాల్లో న్యూట్రీ గార్డెన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ రవి, డీఆర్డీవో రవీందర్, డీపీవో రమేశ్, హౌసింగ్ పీడీ శంకర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


