క్రీడా పాఠశాలలో టెన్త్ వరకే బోధన ‘పది’ తర్వాత క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు ఇంటర్ వరకు ఉన్నతీకరించాలని వేడుకోలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2016 సంవత్సరంలో క్రీడా పాఠశాలను ప్రారంభించారు. ఇందులో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు ఆసక్తి ఉన్న క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అయితే ఇంటర్ అందుబాటులో లేకపోవడంతో ప్రతిభావంతులైన క్రీడాకారుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పది పూర్తికాగానే విద్యార్థులు పాఠశాలను వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఆటపై పట్టు సాధించే క్రమంలో శిక్షణ నిలిచిపోవడంతో వారి క్రీడా భవిష్యత్తు సందిగ్ధంలో పడుతోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రీడా పాఠశాలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయాలని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
పతకాల పంట..
ఇందులో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఆయా క్రీడాంశాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నా రు. జిల్లా, రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా, జా తీయ స్థాయిలోనూ ప్రాతినిధ్యం వహిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఇటీవల నిర్వహించిన ‘సీఎం కప్ రెండో ఎడిషన్’ పోటీల్లో విద్యార్థులు అత్యధిక పతకాలు సాధించడం వారి ప్రతిభకు నిదర్శనం. ‘ఓవరాల్ చాంపియన్’ సైతం కై వసం చేసుకున్నారు.
కీలక సమయంలో బయటికి..
ఇక్కడ పాఠశాల స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులు
ఇంటర్మీడియెట్ అందుబాటలో లేకపోవడంతో వేరే చోట చదవాల్సి వస్తోంది. ఈ క్ర మంలో చదువుపై ఒత్తిడి పెరిగి విద్యార్థులు క్రీడల కు దూరమవుతున్నారు. ఆడాలనే ఆసక్తి ఉన్నప్పటి కీ, సమయం, సదుపాయాలు, శిక్షకులు లేక వారి ప్రతిభ మరుగున పడిపోతోంది. కొంతమంది స్థానికంగా ఉంటూ ఇంటర్ కళాశాలల్లో చేరి, ప్రతిరోజూ తమ పాత శిక్షకుల వద్ద శిక్షణ తీసుకుంటున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆటకు శాశ్వతంగా దూరమవుతున్నారు.
అప్గ్రేడ్ చేస్తే..
ప్రస్తుతం ఉన్న క్రీడా పాఠశాలను ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. దీనివల్ల వారి క్రీడా శిక్షణ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఫలితంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి వేదికలపై కూడా సత్తా చాటే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని క్రీడాకారులు కోరుతున్నారు.
పదో తరగతి వరకూ...
ఈ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశాలు ప్రారంభమై పదో తరగతి వరకు బోధన కొనసాగుతోంది. విద్యార్థులకు జూడో, అథ్లెటిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. అలాగే నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఉచితవసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 195 మంది విద్యాభ్యాసంతో పాటు క్రీడల్లో మెలకువలు నేర్చుకుంటున్నారు.


