సాక్షి,ఆదిలాబాద్: యాసంగిలో సాగు చేసిన శనగ పంట దిగుబడి చేతికందుతుంది. రైతులు పంటను కోసి ఆరబెట్టడంతో పాటు ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు సెంటర్ల ప్రారంభానికి సంబంధించి ఊసే లేదు. మరోపక్క ఈనెల 15 నుంచి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందనే సూచనతో వారిలో గుబులు మొదలైంది. అంతకుముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఆరబెట్టకుండా ఇంట్లో నిల్వ ఉంచడమే ఉత్తమమని రైతులు భావిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
ప్రభుత్వరంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా శనగలు కొనుగోలు చేస్తారు. గతేడాది శనగకు మద్దతు ధర రూ.5,650 ఉండగా, ప్రైవేట్లో అధిక ధర లభించడం ద్వారా రైతులు ఎక్కువగా అటే మొగ్గుచూపారు. గతేడాది జిల్లాలో తొమ్మిది కేంద్రాలు ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్లో ఏర్పాటు చేశారు. ఈసారి కూడా అవే కొనుగోలు కేంద్రాలు ఉండనున్నాయి. మార్క్ఫెడ్లో కేవలం 60వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ సారి కూడా జిల్లాలో పెద్ద ఎత్తున శనగ సాగైంది. ప్రస్తుతం దిగుబడులు చేతికందుతున్నాయి. ఇప్పటికే రైతులు సగం పంటను కోసి ఆరబెట్టారు. ఇంట్లో దిగుబడులను పెద్ద ఎత్తున నిల్వ చేశారు. కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం..
మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. అక్కడి నుంచి అంగీకారం రాగానే ప్రారంభించడం జరుగుతుంది.
– ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్
డీఎం, ఆదిలాబాద్
ఇక్కడ కనిపిస్తు న్న రైతు గడ్డం సురేందర్రెడ్డి. తాంసి మండలకేంద్రం. నాలుగెకరాల్లో శనగ సా గు చేశాడు. ఇటీవల రెండున్నర ఎకరాల్లో కోత చేపట్టాడు. 28 క్వింటాళ్ల వరకు చేతి కొచ్చిన దిగుబడిని ఇంటి సమీపంలో ఆరబెట్టి నిల్వ చేశాడు. అయితే మార్కెట్లో ఇప్పటివరకు కొనుగో లు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఆందో ళన చెందుతున్నాడు. ఇతనొక్కడే కాదు.. జిల్లాలో అనేక మంది శనగ రైతులది ఇదే పరిస్థితి.
సాగు, దిగుబడి వివరాలు..
సాగు విస్తీర్ణం: 42వేల ఎకరాలు
దిగుబడి అంచనా: 3లక్షల 28వేల క్వింటాళ్లు
మద్దతు ధర: రూ.5,875


