‘రేషన్’ అనర్హుల ఏరివేతకు సర్కారు ఆదేశం జిల్లాకు 4,182 అనుమానిత కార్డుల జాబితా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది విచారణ
కై లాస్నగర్: ఓ వైపు అర్హులైన నిరుపేదలకు కొత్తగా రేషన్కార్డులు జారీ చేస్తున్న ప్రభుత్వం మరోవైపు అనర్హులను ఏరివేసే దిశగానూ చర్యలు చేపడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఈ ప్రక్రియ నిర్వహిస్తోంది. అనుమానితంగా గుర్తించిన 4,182 కార్డులతో కూడిన జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి పంపించింది. వాటిపై క్షేత్రస్థాయిలో విచారించి అనర్హులని నిర్ధారణ అయితే ఆ కార్డులు రద్దు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మండలాల వారీగా రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయంతో అక్రమకార్డుదారుల్లో వణుకు మొదలైంది.
360 డిగ్రీస్ సాఫ్ట్వేర్ ఆధారంగా ..
రేషన్కార్డు కలిగిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్కార్డునే ప్రమాణికంగా తీసుకుంటుంది. దీంతో ఈ కార్డుకు డిమాండ్ ఏర్పడింది. అయితే అర్హతలేని వారు అక్రమంగా కార్డులు పొందినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, ఆదాయ పన్ను శాఖల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 360 డిగ్రీస్ సాఫ్ట్వేర్ సాయంతో అనర్హులను గుర్తించింది. వీరితో పాటు గడిచిన మూడు నెలలుగా బియ్యం పొందనటువంటి కార్డుదారుల వివరాలను సేకరిస్తోంది. ఇందులో ప్రభుత్వ కొలువులు సాధించిన వారు, చనిపోయిన వారు, రాష్ట్రంతో పాటు పొరుగురాష్ట్రంలోనూ కొందరికి కార్డులున్నట్లుగా గుర్తించింది. ఆయా కార్డుల్లోని సభ్యులను అనుమానితులుగా భావించి విచారణకు ఆదేశించింది. జిల్లాకు అందిన కార్డుదారుల జాబితా ఆధారంగా రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. దీంతో సిబ్బందికి అక్రమంగా డబ్బులిచ్చి కార్డులు పొందిన వారిలో ఆందోళన మొదలైంది. కార్డు పోకుండా ఉండేందుకు మళ్లీ ముడుపులు ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం నుంచి అందిన అనుమానిత
అనర్హుల కార్డుల వివరాలు (మండలాల వారీగా)
మండలం అనుమానిత
కార్డులు
ఆదిలాబాద్ అర్బన్ 1,351
ఆదిలాబాద్ రూరల్ 268
మావల 186
బజార్హత్నూర్ 79
బోథ్ 125
ఇచ్చోడ 210
నేరడిగొండ 106
సొనాల 55
బేల 77
భోరజ్ 94
జైనథ్ 140
సాత్నాల 58
గుడిహత్నూర్ 111
ఇంద్రవెల్లి 266
సిరికొండ 199
ఉట్నూర్ 440
భీంపూర్ 47
తలమడుగు 116
తాంసి 80
గాదిగూడ 52
నార్నూర్ 122
విచారణ కొనసాగుతుంది..
ప్రభుత్వం నుంచి అందిన అనుమానిత కార్డుదారుల వివరాలను మండలాల వారీగా సంబంధిత తహసీల్దార్లకు పంపించాం. క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ జరుగుతుంది. అనర్హులని తేలిన వారి పేర్లను కార్డుల్లో నుంచి తొలగిస్తాం. రేషన్ పంపిణీని నిలిపివేస్తాం.
– నందిని, ఇన్చార్జి డీఎస్వో


