తాంసి: మండలంలోని పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు పులి టెన్షన్ పట్టుకుంది. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నాలు గు నెలలుగా భీంపూర్లోని ఆయా గ్రామాల శివా రుల్లో తరచూ పులి సంచరిస్తోంది. దీంతో ఎటు వై పు నుంచి పులి వస్తుందో తెలియని పరిస్థతి నెలకొంది. పంటచేలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. నెలక్రితం గొల్లఘాట్ శివారులో పులి ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. తాజాగా మళ్లీ గొల్లఘాట్ శివారులోని పంటచేలలో పులి సంచరిస్తున్నట్లు దాని పాదముద్రలు గుర్తించిన రైతులు తెలిపారు. నెలక్రితం పులి సంచరించడంతో ఆందోళనకు గురైన ప్రజలు అది వెళ్లిపోయిందనుకునే లోపే మళ్లీ రైతులకు పాదముద్రలు కనిపించాయి. దీంతో పులి ఇక్కడే సంచరిస్తున్నట్లు నిర్ధారణైంది. న దీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు, రైతులు, కూలీలు పులి భయంతో వణికిపోతున్నారు. పంటచేలకు పనులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులి వరుసగా ఇక్కడే సంచరిస్తుండటంతో ఎప్పుడు ఎటు నుంచి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
కొన్ని నెలలుగా ఇక్కడే..
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి నాలుగు నెలలుగా ఇక్కడే తిష్ట వేసినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్లో ఇటు వైపు వచ్చిన పులి ఇక్కడే పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో సంచరిస్తోంది. పులి సంచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతూ దాని కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కానీ, గత నెల 3న పులి ఎద్దుపై దాడి చేసి హతమార్చడంతో అది సంచరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడే ఉన్న పులి తరచూ ఆయా గ్రామాల శివారులోని పంటచేలలో సంచరిస్తూ రైతులకు కనిపిస్తోంది. మండలంలోని గొల్లఘాట్, తాంసి(కే), పిప్పల్కోటితో పాటు గుంజాల శివారులో తరచూ సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజులకు ఒకచోట పులి కనిపిస్తుండంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అటవీశాఖ అధికారులు పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించినప్పుడే అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి హతమార్చడంతో తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు వాపోతున్నారు. పులి సంచారం ఉన్నట్లు ముందస్తు సమాచారం ఇస్తే అటు వైపు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు పులి సంచారం ఉన్నప్పుడు ముందస్తుగా అప్రమత్తం చేయాలని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


