ఎన్నికల నియమాలు పాటించాలి
ఆదిలాబాద్టౌన్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. స్థానిక టీటీడీసీ కేంద్రంలో సోమవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలి పారు. ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని, గుంపులుగా తిరగరాదని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, గొడవలకు దారితీసేలా పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. సోమవారం సాయంత్రం 5 నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుందని, ఎలాంటి ప్రచారం చేయరాదని, బయట వ్యక్తులు పట్టణంలో ఉండరాదని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని తెఇపారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకుని ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, మావల సీఐ కర్రె స్వామి, మున్సిపల్ కమిషనర్ రాజు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
బహుమతులు ఇచ్చినా, తీసుకున్నా నేరమే
ఎన్నికల్లో ఓటుకు మద్యం, నగదు, బహుమతులు ఇచ్చినా, తీసుకున్నా నేరమేనని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని రాంనగర్, బొక్కల్గూడ, అబ్దుల్లాచౌక్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిస్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యమని అన్నారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు సునిల్ కుమార్, నాగరాజు తదితరులున్నారు.


