పట్టణంలో పల్లె నేతల సందడి
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పల్లె నేతలు సందడి చేస్తున్నారు. ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచి ఇక్కడే మకాం వేసిన సదరు నాయకులు ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించాయి. ఆయా పార్టీల తరఫున అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఆదిలాబాద్, బోఽథ్ నియోజకవర్గాల్లోని పల్లె నేతలకు ఇక్కడి ప్రచార బాధ్యతలు అప్పగించారు. జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్, మావల, తాంసి, తలమడుగు మండలాలకు చెందిన సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, పార్టీ పరమైన పదవుల్లో ఉన్న వారితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులను వార్డుల వారీగా ఇన్చార్జీలుగా నియమించారు. రంగంలోకి దిగిన సదరు నాయకులు తమకు కేటాయించిన వార్డులోని అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ వార్డులో చూసినా పల్లె ప్రాంత నాయకులే కనిపిస్తుండడం గమనార్హం.


