విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ఇంద్రవెల్లి: విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై సాయన్న తెలిపిన వివరాల మేరకు మండలంలోని దనోరా(బి) గ్రామానికి చెందిన మదురే అక్షయ్ (30), అదే గ్రామానికి చెందిన పసరే ఆకాష్ గౌరపూర్ శివారులోని ఓ రైతు వ్యవసాయ చేనులో బెల్టుషాపు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు 11 కేవీ వైర్లకు కొండీల ద్వారా విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాష్ సమాచారంతో గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బాసర గోదావరిలో మృతదేహం లభ్యం
బాసర: బాసర గోదావరిలో యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. తానూర్ మండలంలోని దాగా గ్రామానికి చెందిన పీకలకర్ బాలాజీ (34) మద్యానికి బానిసై మానసిక స్థితి కోల్పోయాడు. ఈనెల 1న ఇంటినుంచి బయటకు వెళ్ళి తిరిగిరాలేదు. బుధవారం గోదావరినదిలో మృతదేహం గుర్తించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని సోదరుడు భోజన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


