మున్సిపల్ చైర్మన్లుగా తండ్రీకొడుకులు
కైలాస్నగర్: రాజకీయాల్లో వార్డు సభ్యుడిగా గెలవాలంటేనే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడినా పదవి వరిస్తుందనే గ్యారంటీ ఉండదు. అలాంటిది తండ్రీకొడుకులు ఒకే పదవిని చేపట్టి సమర్థవంతంగా పనిచేయడం ప్రజల్లో వారికున్న బలం, ఆదరణకు అద్దం పడుతోంది. ఆదిలాబాద్ మున్సిపల్ బరిలో నిలిచిన మసూద్ హైమద్ ఖుర్షీద్ ప్రజల మద్దతుతో అధ్యక్షుడిగా గెలుపొందారు. 1962నుంచి 1965 వరకు ఆయన మున్సిపల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఆయన 1972లో ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్ట్, జిల్లా కేంద్రంలోని సీసీఐ పరిశ్రమ, స్పిన్నింగ్ మిల్లులకు ఆయన హయాంలోనే బీజం పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి అడుగిడిన జావిద్ హైమద్ ఖుర్షీద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. తండ్రి మసూద్ హైమద్ ఖుర్షీద్ చేసిన సేవలను గుర్తించిన ప్రజలు జావీద్ను ఆశీర్వదించి మున్సిపల్ చైర్మన్గా గెలిపించారు. ఆయన 29.03.1995 నుంచి 31.01.2000 వరకు బల్దియా చైర్మన్గా బాధ్యతలు నిర్వహించి పట్టణాభివృద్ధికి ఎంతో కృషిచేశారు. ఇలా మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన తండ్రీకొడుకులు ప్రజల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ వారి సేవలను ప్రజలు గుర్తుంచుకోవడం వారి సేవానిరతికి అద్దం పడుతోంది.
మున్సిపల్ చైర్మన్లుగా తండ్రీకొడుకులు


