రూపాయి ఖర్చు లేకుండానే కౌన్సిలర్గా..
కైలాస్నగర్: నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు చేసిన చిన్న పొరపాటు వారిని ఎన్నికలకు దూరం చేసింది. నిబంధనల ప్రకారం నామినేషన్ వేసిన అభ్యర్థిని రూపాయి ఖర్చు లేకుండా అనూహ్యంగా కౌన్సిలర్ పదవి వరించింది. 2014 మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఈ సంఘటన ప్రతీ మున్సిపల్ ఎన్నికల సమయంలో తీవ్ర చర్చనీ యాంశం కావడమే కాకుండా పోటీ చేసే అభ్యర్థులకు ఓ హెచ్చరికలా నిలుస్తోంది. నాడు 34వ వా ర్డు, ప్రస్తుతం 20వ వార్డుగా ఉన్న భాగ్యనగర్ కౌ న్సిలర్ స్థానం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున మేస్రం కృష్ణ, టీఆర్ఎస్ తరఫున గే డం సంజయ్, కాంగ్రెస్ తరఫున మేస్రం కిశోర్, టీడీపీ తరఫున గేడం సుభాష్ కౌ న్సిలర్ పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ష్యూరిటీ సంతకాలు చేయించకుండానే నామినేషన్లు వేశారు. వారి మూడు నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు ష్యూరిటీ సంతకాలు లేవనే కారణంతో మూడింటినీ తిరస్కరించారు. దీంతో నిబంధనల మేరకు నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి మేస్రం కృష్ణ రూపాయి ప్రచార ఖర్చు లేకుండా కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందుకే నామినేషన్ పత్రాలు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తుంటారు.


