తడిసి మోపడాయే!
‘ప్రచారంలో జనం నా వెంట వస్తుంటే కొండంత బలం అనిపించింది.. అడిగిన వారికి కాదనకుండా ఖర్చు పెట్టాను.. కనీసం 2వేల ఓట్లు పక్కాగా వస్తాయని ధీమా అనిపించింది.. తీరా బాక్సులు తెరి చాక కేవలం 500 ఓట్లు మాత్రమే వచ్చాయి.’ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఓ అభ్యర్థి ఆవేదన ఇది.
బోథ్ నియోజకవర్గంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీలో పోటీ చేసిన 10 మంది అభ్యర్థుల ఖర్చు ఏకంగా రూ.కోటిన్నర దాటింది. ఎలాగైనా సర్పంచ్ పదవి కై వసం చేసుకోవాలని పోటాపోటీగా ప్రచారం చేశారు. అన్ని వర్గాలను కలి శారు. హామీల వర్షం కురిపించారు. ఇక గెలుపు తమదే అని ఆశించారు. కానీ ప్రజాతీర్పులో ఓడిపోయారు.
బోథ్: పల్లె పోరు ముగిసింది.. పంచాయతీల్లో సర్పంచ్గా గెలుపొందిన వారు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఆ గెలుపు వెనుక ఉన్న ‘ఖర్చు’ భారీగానే ఉంది. సేవ చేయడం పక్కన పెడితే, విజయం కోసం అభ్యర్థులు చేసిన ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఓడిన వారి పరిస్థితి వర్ణనాతీతమే.
లక్షల్లో కుమ్మరించిన అభ్యర్థులు..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషించింది. జిల్లాలో అనేక చోట్ల ఓటుకు రూ.500 నుంచి రూ.2వేల వరకు పంచినట్లు తెలిసింది. దావత్ల అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈసారి ప్రచారానికి సోషల్ మీడియా టీమ్స్, ఫ్లెక్సీలు, ఆటో ప్రచారాల కోసం కూడా రూ.లక్షల్లోనే వెచ్చించారు. విజయం సాధించిన అభ్యర్థుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఖర్చు సెగలు పుట్టిస్తోంది. రాబోయే ఐదేళ్లలో పంచాయతీ నిధులు ఈ ఖర్చులో పదో వంతు కూడా తిరిగి రావు అన్నది నగ్న సత్యం. మరి అభ్యర్థులు ఆ ఖర్చును ఎలా భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.


