
15 లీటర్ల గుడుంబా స్వాధీనం
గుడిహత్నూర్: మండలంలోని నేరడిగొండ తండాలో శనివారం దాడులు నిర్వహించి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రాథోడ్ రమేశ్, రాథోడ్ రోహిదాస్, రాథోడ్ కృష్ణ, ఆడే లక్ష్మీబాయిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రెండు గ్రామాల్లో..
బోథ్: మండలంలోని నిగిని, కంటెగాం గ్రామాల్లో దాడులు నిర్వహించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు. నిగిని గ్రామంలో ఆడె గనియా ఇంట్లో లీటరు గుడుంబా, 19 కిలోల ఇప్పపువ్వు, కంటెగాంలో ఆడె దత్తు ఇంట్లో లీటరు గుడుంబా, 20 కిలోల ఇప్పపువ్వు, రాథోడ్ దత్తు ఇంట్లో లీటరు గుడుంబా, 25 కిలోల ఇప్పపువ్వు లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
గుడుంబా స్థావరాలపై దాడులు
ఇచ్చోడ: మండలంలోని జామిడి, జల్దా, సిరిచెల్మ గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. జామిడిలో రాథోడ్ రాజు వద్ద 10 లీటర్ల నాటుసారా, జల్దాలోని పునీబాయి వద్ద 2 లీటర్లు, సిరిచెల్మలోని గుండాల బాపు వద్ద 2 లీటర్ల ఇప్పపువ్వు సారా స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
అదుపుతప్పి ఆటో బోల్తా
ఆదిలాబాద్రూరల్: మండలంలోని ఖండాల అటవీ ప్రాంతంలో శనివారం అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల మేరకు బేల మండలానికి చెందిన పలువురు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పాటగూడలో జరిగే అంత్యక్రియలకు ఆటోలో బయలుదేరి వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఖండాల అటవీ ప్రాంతాంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు ఈఎంటీ కార్తీక్ సింగ్, పైలట్ విఠల్ గౌడ్ తెలిపారు.
మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కైలాస్నగర్: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమాయక ప్రజలను అధిక లాభాల ఆశ చూపి మోసం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ myv3ads అనే అప్లికేషన్లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదయ్యేందుకు రూ.1,21,000 చెల్లించాలని ఇద్దరికి ఆశచూపి మోసం చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇంకా ఈ అప్లికేషన్ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చన్నారు.
భీమన్న ఆలయంలో చోరీ
సోన్: మండలంలోని కూచన్పల్లి గ్రామ సమీపంలో ఉన్న న్యాకపు కులస్తుల ఆరాధ్య దైవమైన భీమన్న ఆలయంలో గురువారం చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై గోపి సంఘటన స్థలానికి చేరుకుని ఆలయ పూజారి దేశి నరును అడిగి తెలుసుకున్నారు. 40 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.2వేల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

15 లీటర్ల గుడుంబా స్వాధీనం