
‘రిజిస్ట్రేషన్’లో అక్రమాలు
సాక్షి, ఆదిలాబాద్: రిజిస్ట్రేషన్ కార్యాలయాలల్లో కొద్ది నెలల క్రితం ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తద్వారా ప్రజలు ముందుగా ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్లిపొవచ్చు. ఇక్కడ అవినీతికి తావులేకుండా నేరుగా ప్రక్రియ సాగిపోతుందని అంతా భావిస్తారు. అయితే లోపల జరిగేది మాత్రం వేరే తంతు. గతంలో జరిగిన ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదు. దీనికి ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే నిదర్శనం.
ఆదిలాబాద్ జాయింట్–2 సబ్రిజిస్ట్రార్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రూ.5వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన రిజిస్ట్రేషన్ శాఖలో సంచలనం కలిగించింది. అయితే ఈ శాఖలో చేయి తడపనిదే.. రిజిస్ట్రేషన్ జరగదనేది అందరికి తెలిసిన సత్యమే. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా ఏదైనా మార్పు జరిగిందనుకుంటే పొరపాటే. ఆ కార్యాలయాల్లో గతంలో సాగిన అవినీతి కార్యకలాపాలే ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం. ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. నెల క్రితం ఈ కార్యాలయానికి చెందిన ఓ సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రైటర్లతో సమావేశం నిర్వహించి ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అసెస్మెంట్ ఆధారంగా ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేస్తానని, ఇందుకోసం పార్టీలను తీసుకురావాలని డీడబ్ల్యూఓలతో అందులో పేర్కొన్నాడు. పార్టీ నుంచి మీరెంత తీసుకున్న నాకు మాత్రం రూ.15వేలు ముట్టజెప్పాలని ఒప్పందం చేసుకున్నాడు. అయితే లింకు డాక్యుమెంట్లు లేకుండా ఆస్తులకు కేవలం అసెస్మెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయరాదని స్వయంగా కలెక్టర్ నుంచి ఆదేశాలున్నాయి. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ సమావేశం నిర్వహించి మరీ డాక్యుమెంట్ రైటర్లను దొడ్డిదారి ప్రక్రియకు ప్రోత్సహించడం గమనార్హం. విషయాన్ని గతంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
పర్యవేక్షణ కరువు ..
ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు ఎస్ఆర్వో పోస్టులు ఉండగా , జాయింట్–1గా రె గ్యులర్ అధికారి విజయ్కాంత్రావు కొనసాగుతున్నారు. ఇక జాయింట్–2 పోస్టు ఖాళీగా ఉండగా సీ నియర్ అసిస్టెంట్ అయిన శ్రీనివాసరెడ్డి ఇన్చార్జి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. జాయింట్–1 కొద్ది రోజులుగా సెలవులో ఉన్నారు. దీంతో ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ శ్రీనివాస్రెడ్డి కనుసన్నల్లోనే రిజిస్ట్రేష న్ ప్రక్రియ సాగుతుంది. ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడటం ప్రస్తుతం ఆ శాఖలో కలకలం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు జిల్లా రిజిస్ట్రార్గా కొనసాగుతున్న రవీందర్రావు కొద్ది రోజులుగా సెలవుల్లో ఉన్నారు. నిజా మాబాద్ డీఆర్ ప్రసన్న ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కు ఇన్చార్జి డీఆర్గా కొనసాగుతున్నారు. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే అక్రమాలకు అడ్డుపడడం లేదని తెలుస్తోంది.
సీనియర్ అసిస్టెంట్కు కేటాయింపు
ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తాత్కాలికంగా సీనియర్ అసిస్టెంట్ పి. వి జయ్కృష్ణకు ఇన్చార్జి ఎస్ఆర్వోగా బాధ్యతలు అప్పగించాం. రెగ్యులర్ డీఆర్ సెలవు నుంచి వచ్చిన తర్వాత రెగ్యులర్ సబ్రిజిస్ట్రార్ నియామక విషయంలో చర్యలు తీసుకుంటాం.
– ప్రసన్న,
ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్