
● గతేడాది లక్ష్యంతో పోల్చితే ఈ సారి 28లక్షలు తగ్గింపు ●
కై లాస్నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆధారపడ్డ కూలీలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2025–26 సంవత్సరానికి గాను చేపట్టా ల్సిన పనిదినాల్లో భారీగా కోత విధించింది. గతేడాది లక్ష్యానికి మించి పనులు జరగడంతో కూ లీలకు వేసవిలో ఉపాధి లభించింది. జిల్లావ్యాప్తంగా 5,378 కుటుంబాలు వంద రోజుల పాటు పని చేశాయి. అయితే ఈ ఏడాది రాష్టవ్యాప్తంగా ఉపాధి పనిదినాలను తగ్గించగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలోనూ భారీగా గండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో చేసిన పనుల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అ మలు చేస్తుండటంతో జాబ్కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పనిదినాలు తగ్గడంతో కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.
గతేడాది లక్ష్యానికి మించి..
2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 52.35 లక్షల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం కేటా యించింది. గ్రామీణ ప్రాంత కూలీలు ఈ అవకా శాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. కూలీల సంఖ్య పెరుగడంతో జిల్లావ్యాప్తంగా 54.84లక్షల పనిదినాలు జరిగాయి. దీంతో 104.75శాతం నమోదైంది. లక్ష్యానికి మించి పనులు జరగడంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక బృందాలను పంపించి పనుల ప్రగతిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో పనులకు కూలీలు వాస్తవంగా హాజరవుతున్నారా లేక బోగస్ హాజరు నమోదు చేస్తున్నారా అనే దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కొన్ని పనులు కేంద్ర నిబంధనల ప్రకారం జరగకపోవడంతో పనిదినా లను భారీగా తగ్గించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఏడాదికి కేవలం 23.81లక్షల పని దినాలు మాత్రమే నిర్దేశించింది. గతేడాదితో పో ల్చితే 28లక్షల పనిదినాలను తగ్గించింది. దీంతో ఉపాధి హామీ పనులపై ఆధారపడ్డ కూలీలు కేంద్ర నిర్ణయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రశ్నార్థకంగా ‘ఉపాధి’
ఈ ఏడాదికి 23.81 లక్షల పనిదినాలను లక్ష్యంగా కేటాయించగా అందులో ఇప్పటికే 11.21 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. వ్యవసాయ పనులు జరగకపోవడంతో మే నెలంతా ఉపాధి పనులు ముమ్మరంగా సాగనున్నాయి. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురిసే జూన్ వరకు కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యే అవకాశముంది. వ్యవసాయ పనులు ప్రారంభమైతేనే కూలీల సంఖ్య తగ్గే అవకాశముంటుంది. అయితే ఈ రెండు నెలల్లోనే జిల్లాకు కేటాయించిన పనుల లక్ష్యం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం పూర్తయితే మిగతా సమయాల్లో ఉపాధి పనులను చేపట్టి కూలీలకు పనులు కల్పిస్తారా లేక నిలిపివేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి జాబ్ కార్డుల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూలీలకు రూ.12వేల ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా జాబ్కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే జాబ్ కార్డు కలిగి ఉండి పనులకు హాజరుకానుటువంటి వారు కూడా పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పనిదినాల లక్ష్యం పెంచాల్సిన అవసరముందనే అభిప్రాయం కూలీల నుంచి వ్యక్తమవుతోంది.
ఉపాధి పనుల్లో నిమగ్నమైన కూలీలు
జిల్లాలోని ఉపాధి పనుల వివరాలు..
గ్రామీణ మండలాలు : 20
పంచాయతీలు : 473
జాబ్కార్డుల సంఖ్య : 1.74లక్షలు
నమోదు చేసుకున్న కూలీలు: 3.47లక్షలు
యాక్టివ్ జాబ్కార్డులు : 1.09 లక్షలు
పనులకు హాజరయ్యే కూలీలు : 2.04 లక్షలు
లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం
గతేడాదితో పోల్చితే కేంద్ర ప్రభుత్వం ఈ సారి పనిదినాలను తగ్గించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిదినాలను తగ్గించగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో కోత పడింది. అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతీ కూలీకి ప్రస్తుతం పనులు కల్పించేలా శ్రద్ధ వహిస్తున్నాం. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం. అప్పటికీ కూలీల నుంచి పనుల కోసం డిమాండ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో