
ఆదివాసీలపై దమనకాండను ఆపాలి
ఆదిలాబాద్రూరల్: అమాయక ఆదివాసీలపై ప్రభుత్వాలు చేపడుతున్న దమనకాండను వెంటనే నిలిపివేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం నుంచి కుమురంభీంచౌక్ వరకు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీ అమాయకులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి శాంతి చర్చలు జరిపించాలన్నారు. ఇందులో వివిధ సంఘాల నాయకులు గోడం గణేశ్, సాజిద్ఖాన్, మల్లేశ్, శంకర్, సచిన్, తదితరులు పాల్గొన్నారు.