ఆ పనులపై నీలినీడలు!
● ‘ఎస్సీ సబ్ప్లాన్’ కేటాయింపుపై గందరగోళం ● బోథ్ నియోజకవర్గానికి రూ.10 కోట్ల నిధులు ● మంత్రి సీతక్క ద్వారా పనుల కేటాయింపు ● మొదట ఎమ్మెల్యేకు, తర్వాత కాంగ్రెస్ ఇన్చార్జీకి పంపకాలు ● ఆరోపణల నేపథ్యంలో రెండింటి ఉత్తర్వులు నిలిపివేత
సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉండటం, జిల్లాలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కలిగి ఉండడంతో ప్రభుత్వం చేపట్టే అధికారిక పనుల కేటాయింపులో తారతమ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో చేపట్టే పనుల విషయంలో బోథ్ నియోజకవర్గంలో ఇవి ముదిరాయి. బీఆర్ఎస్కు చెందిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ మధ్య ఈ పనుల పంపకాల విషయంలో రగడ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బీఆర్ఎస్ కార్యకర్తలకు పనుల పంపకాలు చేయాలని చూస్తుండగా, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తమ పార్టీ కార్యకర్తలకు ఈ పనులు పంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే ద్వారా, అటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ద్వారా ఈ పనుల విషయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కపై ఒత్తిడి పెరగడంతో ఆమె తలపట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పటివరకు జారీ చేసిన అన్నిరకాల ఉత్తర్వులను నిలిపివేయడంతో ఈ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రూ.10 కోట్ల విలువైన పనులు..
ఎస్సీ సబ్ప్లాన్ కింద నియోజకవర్గానికి రూ.10 కో ట్ల విలువైన పనులను ప్రభుత్వం కేటాయించింది. ఈ పనుల పంపకాల విషయంలో బోథ్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా వార్ ముదిరింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వీటిని మంజూరు చేశారు. మొదట బోథ్ ఎమ్మె ల్యే అనిల్ జాదవ్కు ఈవర్క్ పంపకాలు చేస్తూ మంత్రి సీతక్క నుంచి నిర్ణయం వెలువడింది. దీంతో ఎమ్మెల్యే తన అనుచరులకు కేటాయించారు. సీసీ రోడ్లు, నాలాలు నిర్మించేందుకు వీటినిఉపయోగిస్తున్నారు. రూ.5లక్షల అంచనా వ్యయంతో నామి నేష న్ పద్ధతిన పనులను అప్పగించారు. అయితే అప్ప ట్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఎమ్మె ల్యే ఈ పనులను ప్రారంభిస్తున్నారని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి గజేందర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నే పథ్యంలో అప్పట్లో ప్రతిపాదించిన తీర్మానాలను మంత్రి సీతక్క ఆదేశాలతో నిలిపివేశారు. దీంతో తమ ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆ పనులను ఎన్నికల తర్వాత మొదలుపెడతామని ఎమ్మెల్యే వారికి భరోసానిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలకు బోథ్ నియోజకవర్గంలో ప్రాధాన్యత లభించడం లే దని, వర్క్స్ కేటాయించడం లేదని కార్యకర్తలు ఇన్చార్జి గజేందర్ ద్వారా మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె కొత్త ప్రొసీడింగ్తో ఈ పనుల ను కాంగ్రెస్ కార్యకర్తలకు పంపిణీ చేశారు. వారు కూడా అక్కడక్కడా ప్రారంభించారు.
మళ్లీ మొదటికి..
తాజాగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను కలిసి ఈ విషయంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తనకు ప్రాధాన్యత కల్పించి పనులు కేటాయించాలని కోరినట్టు సమాచారం. దీంతో మంత్రి సీతక్క తిరిగి కొత్తగా జారీ చేసిన తీర్మానాలను నిలిపివేయాలని జిల్లా యంత్రాంగం ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు తె లుస్తోంది. దీంతో ఎస్సీ సబ్ప్లాన్కు సంబంధించిన రూ.10కోట్ల పనులు బోథ్ నియోజకవర్గంలో ప్రస్తు తం సందిగ్ధంలో పడ్డాయి.
నా దృష్టికి రాలేదు..
ఎస్సీ సబ్ప్లాన్కు సంబంధించి నిధులను ఎమ్మెల్యేలకు కేటాయిస్తారు. బోథ్లో పనుల విషయంలో నెలకొన్న పరిస్థితులు నా దృష్టికి రాలేదు. జిల్లా దళిత అభివృద్ధి శాఖ వద్ద పూర్తి వివరాలు ఉంటాయి. – వెంకటరమణ,
జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో)
ఆ పనులపై నీలినీడలు!
ఆ పనులపై నీలినీడలు!


