అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నేరడిగొండ: తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నేరడిగొండ జాతీయ రహదారి నుంచి కుంటాల జలపాతానికి వెళ్లే రహదారిలో సవర్గాం వద్ద రూ.3.30 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెనకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఎన్ని తిప్పలు పడ్డామో మనందరికీ తెలుసన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయిందన్నారు. కొంతమంది కేవలం రాజకీయ లబ్ధి కో సమే విమర్శలు చేస్తున్నారని, వారిని పట్టించుకో వాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, జెడ్పీటీసీ అనిల్ జాదవ్, ఎంపీపీ రాథోడ్ సజన్, స్థానిక సర్పంచ్ వెంకటరమణ, బోథ్ ఏఎంసీ చైర్మన్ రుక్మన్సింగ్, బీఆర్ఎస్ నాయకులు భోజన్న, నారాయణ సింగ్, భీంరెడ్డి, కిరణ్ కుమార్రెడ్డి, మహేందర్, కరణ్సింగ్ పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు
మండలంలోని ఆరేపల్లి గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యే బాపూరావ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మృతిచెందిన గ్రామానికి చెందిన జాదవ్ సర్దార్ కుటుంబానికి రూ.2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.