breaking news
Dubai Open
-
సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ ఏటీపీ–500 టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. దుబాయ్లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) ద్వయం 5–7, 7–6 (7/5), 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 17వ, 18వ స్థానాల్లో ఉన్న లాయిడ్ గ్లాస్పూల్–జూలియన్ క్యాష్ (బ్రిటన్) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంటను ఓడించిన యూకీ జోడీ క్వార్టర్ ఫైనల్లోనూ కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–ఆసీస్ జోడీ నాలుగు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. -
మళ్లీ ప్రపంచ నంబర్వన్ జోడీపై యూకీ బాంబ్రీ విజయం
వారం రోజుల వ్యవధిలో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ మరోసారి ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జోడీని బోల్తా కొట్టించాడు. దుబాయ్ ఓపెన్ చాంపియన్షిప్ ఏటీపీ–500 టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా) ద్వయం 4–6, 7–6 (7/1), 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–ఆసీస్ జోడీ ఆరు ఏస్లు సంధించింది. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. గతవారం దోహా ఓపెన్–500 టోర్నీలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో కలిసి ఆడిన యూకీ క్వార్టర్ ఫైనల్లో అరెవాలో–పావిక్ జంటపై గెలిచింది. దుబాయ్ ఓపెన్లోనే ఆడుతున్న మరో భారత జోడీ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ తొలి రౌండ్లో 4–6, 6–7 (6/8)తో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
యూకీ జోడీ ఓటమి
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) ద్వయం 3–6, 6–7 (2/7)తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–డోడిగ్ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం పాలైంది. యూకీ–హాస్లకు 48,760 డాలర్ల (రూ. 40 లక్షలు) ప్రైజ్మనీ దక్కింది. -
బోపన్న జోడీకి షాక్
దుబాయ్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించిన తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ఈ జోడీ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 3–6, 8–10తో బెహర్ (ఉరుగ్వే)–పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జంట ఆరు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. యూకీ–హాస్ జంట సంచలనం మరోవైపు ఇదే టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జంట సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ–హాస్ జోడీ 6–4, 7–6 (7/1)తో మూడో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను బోల్తా కొట్టించింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ 89 నిమిషాల్లో 6–7 (6/8), 6–3, 10–8తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)–మనారినో (ఫ్రాన్స్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడుతున్న యూకీ–హాస్ జంట ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
క్వార్టర్స్లో సాకేత్–యూకీ జోడీ ఓటమి
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ చాంపియన్షిలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 2–6, 2–6తో లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్)–హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్, యూకీ రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. నాలుగుసార్లు తమ సర్వీస్ను కోల్పోయిన భారత జోడీ ప్రత్యర్థి జంట సర్విస్లో మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వదులుకుంది. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సాకేత్–యూకీ బాంబ్రీలకు 23,660 డాలర్ల (రూ. 19 లక్షల 52 వేలు) ప్రైజ్మనీ దక్కింది. ఇదే టోర్నీలో రామ్కుమార్ (భారత్)–ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్) జోడీ తొలి రౌండ్లో 4–6, 6–3, 5–10తో సాండెర్ జిలె–విలెజిన్ (బెల్జియం) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ఒలింపిక్ పతకం లేకపోయినా బాధలేదు: సానియా భావోద్వేగం
Sania Mirza Retirement: ‘‘నా జీవితంలో టెన్నిస్ ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుంది. అయితే టెన్నిస్ మాత్రమే జీవితం కాదు. ప్రొఫెషనల్ అథ్లెట్గా ఎదుగుతున్న సమయంలోనే అలా భావించాను. కాబట్టి ఏనాడూ ఓటమి భయం లేదు. ఓడితే మళ్లీ వచ్చి గెలవగలమనే ధైర్యంతోనే ఆడాను. పరాజయాలు నాపై ప్రభావం చూపలేదు. ఓడినప్పుడు కొద్దిసేపు బాధపడినా దాంతో ప్రపంచం ఆగిపోదని నాకు తెలుసు. డబుల్స్ కారణంగానే నాకు గుర్తింపు దక్కింది. దానికి నేను గర్విస్తున్నా. సింగిల్స్లోనూ మన దేశం నుంచి ఎవరికీ సాధ్యం కాని రీతిలో టాప్–30లోకి వచ్చాను కాబట్టి అదీ గొప్ప ఘనతే. మణికట్టుకు శస్త్రచికిత్సల తర్వాత సింగిల్స్లో ఆడటం ఇబ్బందిగా మారడంతో డబుల్స్కు మారాను తప్ప ఆడలేక కాదు. ఎక్కడైనా నంబర్వన్ అంటే చిన్న విషయం కాదు. ఒలింపిక్ పతకం లేకపోయినా నేను సాధించినదాంతో సంతృప్తిగా ఉన్నా. నేనో ట్రెండ్ సెట్టర్గా భావించడం లేదు. నాకు వచ్చిన, నచ్చిన రీతిలో ఆడుతూ పోయాను. ఆ క్రమంలోనే ఈ విజయాలన్నీ వచ్చాయి’’ అని భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. నంబర్ 1గా ఎదిగి.. ఓటమితో ముగింపు ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని.. నంబర్ 1 స్థాయికి ఎదిగిన ఈ హైదరాబాదీ ఆటకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనయ్యారు. దుబాయ్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓటమి ద్వారా ప్లేయర్గా సానియా టెన్నిస్ కెరీర్ ముగిసిపోయింది. ఐదేళ్ల వయసులోనే రాకెట్ పట్టిన సానియా మీర్జా.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. మూడు డబుల్స్ గ్రాండ్స్లామ్, మూడు మిక్స్డ్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచి మరే ఇతర భారత మహిళా టెన్నిస్ ప్లేయర్కు సాధ్యం కాని రీతిలో రికార్డులు నెలకొల్పారు. 43 డబుల్స్ ట్రోఫీలు సాధించారు. 91 వారాలు వరల్డ్ నంబర్వన్గా కొనసాగారు. చదవండి: Sania Mirza: 'వండర్ ఉమన్'.. సానియాకు సలాం! ముక్కుసూటి జవాబులతో.. Smriti Mandhana: వారెవ్వా.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది View this post on Instagram A post shared by Women’s Tennis Association (@wta) -
Sania Mirza: 'వండర్ ఉమన్'.. సానియాకు సలాం! ముక్కుసూటి జవాబులతో..
సానియా మీర్జా అంటే మూడు డబుల్స్ గ్రాండ్స్లామ్, మూడు మిక్స్డ్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 43 డబుల్స్ ట్రోఫీలు, 91 వారాలు వరల్డ్ నంబర్వన్ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 20 ఏళ్ల పాటు టెన్నిస్ సర్క్యూట్లో ప్రొఫెషనల్గా కొనసాగడం మాత్రమేనా? వీటన్నింటికి సమాధానం ‘కాదు’ మాత్రమే! మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో అడుగు పెట్టడమే అరుదుగా అనిపించిన సమయంలో సానియా టెన్నిస్ను ఎంచుకొని కొత్త బాటను వేసింది. తన ఆటను, తన సామర్థ్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె టెన్నిస్కే పరిమితం కాదు. భారత క్రీడలకే ఆమె ఒక ‘వండర్ ఉమన్’. ఎన్నో ఏళ్లుగా మహిళల క్రీడలకు సంబంధించి ఉన్న మూసను సానియా బద్దలు కొట్టింది. ఆటతోనే కాకుండా అవసరమైతే మాటతోనూ తలపడింది. తన స్థాయి ప్లేయర్ను ఒక ‘ఎర’గా వేశారంటూ పురుషాధిక్య సమాజపు నైజాన్ని నేరుగా ప్రశంసించింది. తన ఆటలో సంధించిన ఏస్ల తరహాలోనే మాటల్లో కూడా అంతే పదును చూపించింది. ఎలాంటి టెన్నిస్ నేపథ్యం లేని నగరం నుంచి, సాంప్రదాయ కట్టుబాట్లతో కూడిన తన సొంత నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచ ర్యాంకింగ్స్లో సింగిల్స్లో 27 వరకు, డబుల్స్లో నంబర్వన్ వరకు సానియా ఎదగగలిగింది. ఒక స్టార్గా, దిగ్గజంగా ఆటపై సానియా ముద్ర అసమానం. శ్రమించే తత్వం, పట్టుదలతో ఆమె సాధించిన ఘనతలు స్ఫూర్తిదాయకం. టెన్నిస్లో ఉచ్ఛస్థితికి చేరుతున్న సమయంలో వెంట నడిచి వచ్చిన వివాదాలను ఆమె లెక్క చేయలేదు. చాలా మందిలా కన్నీళ్లు పెట్టుకొని కుప్పకూలిపోలేదు... మొండిగా నిలబడింది. అంతే వేగంగా వాటికి తగిన రీతిలో జవాబిచ్చింది. ఎవరి కోసమో తాను మారలేదు, తాను అనుకున్నట్లు ఆడింది, ఆటను ఆస్వాదించింది, అద్భుతాలు చేసింది. సానియాకు పెద్ద సంఖ్యలో వీరాభిమానులున్నారు. వేర్వేరు కారణాలతో ఆమెను ద్వేషించే వారూ ఉన్నారు. కానీ అవునన్నా, కాదన్నా ఏ రూపంలోనైనా ఆమె గుర్తింపును మాత్రం ఎవరూ కాదనలేరు. దశాబ్ద కాలానికి పైగా భారత క్రీడల్లో ‘సానియా మానియా’ అన్ని చోట్లా కనిపించింది, వినిపించింది. ఆమె ఏం చేసినా అది వార్తగా నిలిచింది. భారత టెన్నిస్ చరిత్రలో కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే సింగిల్స్లో టాప్–200 వరకు రాగలిగారు. అందులో నలుగురు కనీసం వందో ర్యాంక్కు చేరువగా కూడా రాలేదు. అలా చూస్తే సానియా సాధించిన 27వ ర్యాంక్ విలువేమిటో అర్థమవుతుంది. దీంతో పాటు డబుల్స్లో శిఖరాన నిలిచి శాసించిన సానియా మీర్జా ఉజ్వల టెన్నిస్కు తెర పడింది. –సాక్షి క్రీడా విభాగం అందని ఒలింపిక్ పతకం సానియా కెరీర్లో ఎన్నో ఘనతలు ఉన్నా... ప్రతిష్టాత్మక ఒలింపిక్ పతకాన్ని మాత్రం ఆమె సొంతం చేసుకోలేకపోయింది. 2008, 2012, 2016, 2020ల్లో నాలుగు ఒలింపిక్స్లోనూ పాల్గొన్నా ఆమెకు అది లోటుగా ఉండిపోయింది. 2016 రియో ఒలింపిక్స్లో రోహన్ బోపన్నతో కలిసి కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానం సాధించడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం ఆమె గెలుచుకుంది. పురుషాహంకారాన్ని ప్రశ్నిస్తూ... కెరీర్ ఆరంభంలో వచ్చిన కీర్తికనకాదులతో పాటు పలు వివాదాలు సానియాతో నడిచొచ్చాయి. జాతీయ జెండాను అవమానించినట్లు వార్తలు, స్కర్ట్లపై ‘ఫత్వా’లు జారీ, మసీదులో షూటింగ్, కొన్ని అసందర్భ వ్యాఖ్యలు, ఆ తర్వాత పాకిస్తానీ అయిన షోయబ్ మలిక్తో వివాహం... ఇలాంటివన్నీ ఆమెను ఒక వివాదాస్పదురాలిగా చిత్రీకరించాయి. వీటి వల్ల ఆమె చాలా సందర్భాల్లో ‘నెగెటివ్’ వార్తల్లో నిలిచింది. వాటిపై వివరణలు ఇచ్చుకునేందుకు ఆమె చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే తర్వాతి రోజుల్లో తాను మరింత పరిణతి చెందానని, ఇలాంటివి పట్టించుకోవడం మానేశానని ఆమె చెప్పుకుంది. నిజంగా కూడా ఆపై కెరీర్ కీలక దశలో ఆమె తన ఆటతో మినహా మరే అంశంతోనూ ‘వార్త’గా మారలేదు. అయితే 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా రేగిన వివాదం సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం సానియా వ్యక్తిత్వం గురించి చెబుతాయి. పురుషుల డబుల్స్లో లియాండర్ పేస్తో కలిసి బరిలోకి దిగేందుకు మహేశ్ భూపతి, రోహన్ బోపన్న నిరాకరించగా... విష్ణువర్ధన్ను ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జా తనతో కలిసి ఆడతానని హామీ ఇస్తేనే విష్ణుతో కలిసి బరిలోకి దిగుతానని పేస్ షరతు పెట్టాడు. ఈ విషయం తర్వాత తెలుసుకున్న సానియా దీనిని ‘పురుషా హంకారం’గా పేర్కొంది. పేస్ కోసం తనను ‘ఎర’గా వేశారంటూ విరుచుకుపడింది. వేర్వేరు సందర్భాల్లో కూడా ముక్కుసూటి జవాబులతో ఘాటుగా సమాధానాలు ఇవ్వడం సానియా శైలి. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత కూడా ఇంకా ‘జీవితంలో స్థిరపడలేదేంటి’ అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై... ‘నేను వరల్డ్నంబర్ కావడంకంటే తల్లిగా మారలేదేంటని మీరు అడుగుతున్నట్లున్నారు. నేనే కాదు ప్రతీ మహిళకు ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతా యి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే తప్ప స్థిరపడినట్లు కాదా. నేను ఎన్ని గ్రాండ్స్లామ్ గెలిచినా వాటికి విలువ లేనట్లుంది’ అని తీవ్రంగా జవాబిచ్చింది. సానియా... ఓటమితో ముగింపు తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ చివరి టోరీ్నలో భారత స్టార్ సానియా మీర్జాకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన దుబాయ్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ 4–6, 0–6తో వెరోనిక కుదెర్మెతోవా– సమ్సనోవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా–కీస్ జోడీ తమ సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో ఓడిన సానియా–కీస్లకు 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 54 వేలు) ప్రైజ్మనీ లభించింది. వ్యక్తిగతం... 1986 నవంబర్ 15న సానియా మీర్జా ముంబైలో పుట్టింది. 2010లో పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మలిక్ను వివాహం చేసుకున్న సానియాకు నాలుగేళ్ల కుమారుడు ఇజ్హాన్ ఉన్నాడు. ‘ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ వచ్చింది. కెరీర్లో ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సానియా జీవితాన్ని సినిమాగా తీయాలని ప్రతిపాదనలు వచ్చినా అవి ఫలించలేదు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు కలిసి ‘మీర్జా మలిక్ షో’ అనే చాట్ షోను సమర్పిస్తున్నారు. ఇది పాకిస్తాన్లోని ‘ఉర్దూ ఫ్లిక్స్’ ఓటీటీలో ప్రసారమవుతోంది. భారత ప్రభుత్వం ద్వారా అర్జున, ఖేల్రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఆమె అందుకుంది. ఆ ఆరు గ్రాండ్స్లామ్లు... మహిళల డబుల్స్: వింబుల్డన్ (2015), యూఎస్ ఓపెన్ (2015), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2016; అన్నీ మార్టినా హింగిస్తో). మిక్స్డ్ డబుల్స్: ఆ్రస్టేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012; ఈ రెండూ మహేశ్ భూపతితో); యూఎస్ ఓపెన్ (2014; బ్రూనో సోరెస్తో). కెరీర్ రికార్డ్ సింగిల్స్: విజయాలు 271, పరాజయాలు 161 డబుల్స్: విజయాలు 536, పరాజయాలు 248 కెరీర్ ప్రైజ్మనీ: 72 లక్షల 65 వేల 246 డాలర్లు (రూ. 60 కోట్ల 20 లక్షలు) 1 భారత్ నుంచి డబ్ల్యూటీఏ టైటిల్ (సింగిల్స్, డబుల్స్) గెలిచిన, గ్రాండ్స్లామ్ సింగిల్స్లో నాలుగో రౌండ్కు చేరిన, వరల్డ్ ర్యాంకింగ్ టాప్–50లో నిలిచిన, మహిళల గ్రాండ్స్లామ్ గెలిచిన, డబ్ల్యూటీఏ ఫైనల్స్ గెలిచిన, వరల్డ్ నంబర్వన్గా నిలిచిన తొలి భారత ప్లేయర్ సానియా మీర్జా. పట్టుదలతో పైపైకి... సానియా మీర్జాకు 11 ఏళ్ల వయసు... హైదరాబాద్లోని ఒక కోర్టులో ఆమె సాధన కొనసాగుతోంది... అప్పటికి ఆమె రాకెట్ పట్టుకొని ఐదేళ్లవుతోంది. అయితే ఆమె కెరీర్పై తండ్రి ఇమ్రాన్ మీర్జాకు ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. సానియా ఏమాత్రం ఆడగలదు, అసలు పోటీ ప్రపంచంలో నిలబడగలదా, భవిష్యత్తు ఉంటుందా అనే సందిగ్ధత... అప్పటికే సన్నిహితులు కొందరు ‘మన అమ్మాయికి ఇలాంటి చిన్న స్కర్ట్లతో టెన్నిస్ అవసరమా’ అంటూ మాటలు విసురుతూనే ఉన్నారు. మరో మిత్రుడు వచ్చి ‘ఏంటి సానియాను మార్టినా హింగిస్ను చేద్దామనుకుంటున్నావా’ అంటూ వ్యంగ్య వ్యాఖ్య ఒకటి చేసి వెళ్లిపోయాడు. 16 ఏళ్ళ వయసుకే సింగిల్స్ గ్రాండ్స్లామ్ గెలిచి హింగిస్ సంచలనం సృష్టించిన రోజులవి. అలాంటి మాటలతో ఒక దశలో ఇమ్రాన్లో ఆందోళన పెరిగింది. కానీ దానిని బయట పడనీయలేదు. తర్వాతి రోజుల్లో మార్టినా హింగిస్తోనే జత కట్టి వరల్డ్ నంబర్వన్ జోడీగా నిలవడంతో పాటు 14 డబుల్స్ టైటిల్స్ కలిసి సాధించడం విశేషం. సహజసిద్ధమైన ప్రతిభకు తోడు కష్టపడే గుణం, పట్టుదల, పోరాటతత్వం, ఓటమిని అంగీకరించని నైజం వెరసి సానియాను అగ్ర స్థానానికి చేర్చాయి. కెరీర్ ఆరంభంలో విమానాలకు పెద్దగా ఖర్చు పెట్టలేని స్థితిలో దేశవ్యాప్తంగాటోర్నీ లు ఆడేందుకు ఆ కుటుంబం ఒక పాత కారును ఉపయోగించింది. అప్పుడు రోడ్డు ద్వారా ప్రయాణించిన దూరం ఎన్ని కిలోమీటర్లో కానీ... ఈ సుదీర్ఘ టెన్నిస్ ప్రయాణం మాత్రం వెలకట్టలేని విధంగా భారత క్రీడా చరిత్రలో నిలిచిపోయింది. జూనియర్ వింబుల్డన్ విజేతగా... ఆటలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత హైదరాబాద్లో చిన్నటోర్నీ లు మొదలు జాతీయ స్థాయిలో కూడా వేర్వేరు నగరాల్లో జరిగే పోటీల్లో సానియా పోటీ పడింది. వెంటనే విజయాలు రాకపోయినా ఆమె ఆటలో ప్రత్యేకత ఉందని, దూకుడు కనిపిస్తోందని మాత్రం భారత టెన్నిస్ వర్గాల్లో చర్చ మొదలైంది. 13 ఏళ్ల వయసులో జాతీయ అండర్–14, అండర్–16 టైటిల్స్ గెలవడంతో సానియాకు అసలైన గుర్తింపు లభించింది. జూనియర్ స్థాయిలో ఆమె 10 సింగిల్స్, 13 డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. 2003 వింబుల్డన్టోర్నీ లో జూనియర్ బాలికల డబుల్స్లో రష్యాకు చెందిన అలీసా క్లెబనోవాతో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో ఆమె భారత టెన్నిస్లో కొత్త తారగా అందరి దృష్టిలో పడింది. సొంతగడ్డపై... సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2003లో తన సొంత నగరంలో జరిగిన హైదరాబాద్ ఓపెన్లో వైల్డ్కార్డ్గా బరిలోకి దిగింది. అక్కడ తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైనా రెండేళ్ల తర్వాత ఇదే వేదికపై ఆమె తనకు కావాల్సిన ఫలితాన్ని అందుకుంది. ఇదే హైదరాబాద్ ఓపెన్లో విజేతగా నిలిచి సింగిల్స్లో డబ్ల్యూటీఏ తొలి టైటిల్ సొంతం చేసుకుంది. సానియా కెరీర్లో ఇదే ఏకైక సింగిల్స్ ట్రోఫీ. ఆపై మరో నాలుగు టోర్నీ ల్లో ఫైనల్ చేరినా, ఆమె రన్నరప్ స్థానానికే పరిమితమైంది. 27వ ర్యాంక్కు... 2005లో యూఎస్ ఓపెన్లో నాలుగో రౌండ్ వరకు చేరడంతో ‘డబ్ల్యూటీఏ న్యూ కమర్’గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సింగిల్స్లో కొంత కాలం సానియా జోరు కొనసాగింది. టైటిల్స్ లేకపోయినా పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులపై సాధించిన కొన్ని సంచలన విజయాలు ఆమె సత్తాను చూపించాయి. ముఖ్యంగా హార్డ్ కోర్టుల్లో ప్రదర్శనతో ఆమె ర్యాంక్ మెరుగవుతూ వచ్చింది. ఎట్టకేలకు 2007 ఆగస్టులో సానియా సింగిల్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 27వ స్థానానికి చేరింది. ఇది ఆమె సింగిల్స్ కెరీర్లో అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత దీనిని నిలబెట్టుకోవడంలో ఆమె విఫలమైంది. వరుస పరాజయాలు, మణికట్టు గాయాలు ఆమె సింగిల్స్ ఆటకు ప్రతిబంధకంగా మారాయి. దాంతో సింగిల్స్కు పూర్తిగా గుడ్బై చెప్పి డబుల్స్పైనే దృష్టి పెట్టాలని సానియా నిర్ణయించుకుంది. ఆమె తీసుకున్న ఈ కీలక నిర్ణయం భవిష్యత్తులో ఆమె కెరీర్కు కొత్త ఊపిరి పోసింది. డబుల్స్ స్టార్గా... సొంతగడ్డపై హైదరాబాద్ ఓపెన్లోనే లీజెల్ హ్యూబర్ కలిసి డబుల్స్లోనూ తొలి టైటిల్ (2004) సాధించిన సానియా సింగిల్స్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత వరుస విజయాలు అందుకుంది. మహిళల డబుల్స్లో 82 మందితో జత కట్టిన సానియా 17 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి ఏకంగా 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలవగలిగింది. వీరందరిలోనూ 70వ భాగస్వామి అయిన మార్టినా హింగిస్తో ఆమె అద్భుత ఫలితాలు సాధించింది. ఒక దశలో ఈ జోడీ ఓటమి అనేదే లేకుండా సాగింది. 2015–16 మధ్య కాలంలో వీరిద్దరు వరుసగా 41 మ్యాచ్లలో గెలుపొందడం పెద్ద విశేషం. గ్రాండ్స్లామ్ మిక్స్డ్ డబుల్స్లో 14 మందితో ఆమె జోడీగా బరిలోకి దిగింది. ఇదే క్రమంలో 2015 ఏప్రిల్లో సానియా మొదటిసారి వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్లో ‘వరల్డ్ నంబర్వన్’ స్థానానికి చేరింది. అమ్మగా మారాక... హింగిస్తో కలిసి గెలిచిన 14 టైటిల్స్ను పక్కన పెట్టినా... ఇతర భాగస్వాములతో కలిసి సానియా ఖాతాలో 29 ట్రోఫీలు ఉన్నాయి. అయినా సరే సానియా–హింగిస్ జోడీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. అగ్గికి కి వాయువు తోడైనట్లుగా సానియా అద్భుత ఫోర్హ్యాండ్, హింగిస్ బ్యాక్ హ్యాండ్ కలిసి ప్రత్యర్థులను పడగొట్టాయి. అయితే కారణాలేమైనా హింగిస్తో విడిపోయిన తర్వాత సానియాకు సంతృప్తికర ఫలితాలు రాలేదు. ఆ తర్వాత 4టోర్నీ ల్లోనే ఆమె విజేతగా నిలిచింది. 2018 ఆరంభంలో గాయాలతో కొన్నిటోర్నీ లకు దూరమైన సానియా అదే ఏడాది చివర్లో కొడుకు పుట్టడంతో టెన్నిస్కు నిరవధిక విరామం ఇచ్చింది. అయితే ఏడాదిన్నర తర్వాత మళ్లీ పూర్తి ఫిట్గా మారి పునరాగమనం చేసిన అనంతరం మరో రెండు టైటిల్స్ గెలవడం విశేషం. చివరకు ఈ ఏడాది జనవరిలో తన రిటైర్మెంట్ గురించి సానియా ప్రకటన చేసింది. దుబాయ్ ఓపెన్ తన ప్రొఫెషనల్ కెరీర్లో చివరి టోర్నమెంట్ అని ప్రకటించింది. -
రన్నరప్ బోపన్న జంట
దుబాయ్: నాలుగోసారి దుబాయ్ ఓపెన్లో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మట్కోవ్స్కీ (పోలాండ్) జంటకు ఓటమి ఎదురైంది. 79 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హŸరియా టెకావ్ (రొమేనియా) ద్వయం 4–6, 6–3, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో బోపన్న–మట్కోవ్స్కీ జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. రోజర్–టెకావ్ జంటకు 1,57,570 డాలర్లు (రూ. కోటీ 5 లక్షలు), బోపన్న–మట్కోవ్స్కీ జోడీకి 77,140 డాలర్లు (రూ. 51 లక్షల 46 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
టోర్నీ మధ్యలోనే తప్పుకొన్న వరల్డ్ నంబర్ 1
దుబాయ్: వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. గురువారం క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు ఫెలిసియనో లోపేజ్ తో తలపడగా అనారోగ్యం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. లోపేజ్ తో మ్యాచ్ లో తొలి సెట్ కోల్పోయిన తర్వాత తనకు కంటి సమస్య తలెత్తిందని భావించిన జోకో మ్యాచ్ కొనసాగించలేనని చెప్పడంతో అంపైర్ మ్యాచ్ ను నిలిపివేశాడు. చివరిసారిగా 2011లో అర్జైంటైనా ఆటగాడు డెల్ పొట్రోతో తలపడ్డ మ్యాచ్ మధ్యలోనే జోకోవిచ్ ఆట నుంచి తప్పకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ 4, స్విస్ వీరుడు స్టానిస్లాస్ వావ్రింకా 7-5, 6-1తేడాతో జర్మనీ ప్లేయర్ కొల్స్క్రేబర్ పై విజయాన్ని సాధించాడు. ఈ మ్యాచ్ లో వావ్రింకా ఏడు ఎస్ లు సంధించగా జర్మనీ ఆటగాడి నుంచి సమాధానమే లేకపోయింది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్ లలో బాగ్ధటిస్ 7-5, 6-0 తేడాతో స్పెయిన్ కు చెందిన రోబెర్టో బాటిస్టాపై, ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ 6-4, 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ థామస్ బెర్డిచ్ పై గెలుపొందారు.