breaking news
Cyril Ramaphosa
-
శ్వేతసౌధంలో మళ్లీ ‘పంచాయితీ’
అతిథుల్ని పిలిచి బహిరంగంగా వాగ్యుద్ధానికి దిగటం ఏ రకంగా దౌత్యనీతి అవుతుందో, దాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడ నేర్చారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన దాన్ని కొనసాగించదల్చుకున్నారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో వైట్హౌస్లో తాజాగా సాగిన జగడం నిరూపిస్తోంది. మొన్న ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఇదే మాదిరి తగువు పెట్టుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో తప్పంతా ఉక్రెయిన్దే అన్నట్టు తేల్చి, దాన్ని వెంటనే నిలిపేయాలని ఒత్తిడి తెచ్చారు.అడుగడుగునా అవమా నిస్తూ మాట్లాడారు. మళ్లీ మూణ్ణెల్లకు అదే వైట్హౌస్లో ట్రంప్ ఆ డ్రామాకే తెరతీశారు. నిజానికి ఇరు దేశాల అధినేతలు కలుసుకుని చర్చించినాక వారిద్దరూ కలిసి మాట్లాడే మీడియా సంయుక్త సమావేశం లాంఛనప్రాయమైనది. నాలుగు గోడలమధ్యా నిర్మొహమాటంగా మాట్లాడుకున్నా, వాదులాడుకున్నా... మీడియా సమావేశంలో పరస్పరం ప్రశంసించుకోవటాలు, రెండు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాల విశిష్టతను అతిగా చూపించుకోవటాలు జరిగిపోతాయి. ఇందువల్లరెండు దేశాల్లోనూ అధినేతలకు ప్రశంసలు దక్కుతాయి. కానీ ఇలాంటివి ట్రంప్కు పట్టవు. ప్రపంచానికి తాను మకుటంలేని మహారాజునని, ఎవరినైనా ఏమైనా అనగలనని అమెరికా శ్వేతజాతి ఓటరు మహాశయులకు ఆయన చెప్పదల్చుకున్నారు.అందుకే అతిథులుగా వచ్చిన అధినేతలను కెమెరాల ముందు ఇష్టానుసారం మాట్లాడటం అల వాటు చేసుకున్నారు. పోనీ ఆయన నిలదీస్తున్న అంశాలు గొప్పవేమీ కాదు. వాటిల్లో చాలామటుకు నకిలీవీ... నిరాధారమైనవీ. సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరో పెట్టే తప్పుడు పోస్టింగులే వాటికి ఆధారం. ఉక్రెయిన్లో దేశాధినేతను మార్చి, ఆయన ద్వారా రష్యాను చీకాకుపెట్టి చివరకు అది రెచ్చిపోయి దాడిచేసే స్థితి కల్పించింది అమెరికాయే. అటు తర్వాత రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేయటానికి ప్రయత్నించి, ఉక్రెయిన్కు పెద్దయెత్తున ఆయుధాలు అమ్ముకున్నది అమెరికాయే. నాటో దేశాలను సైతం ఈ రొంపిలోకి దించింది కూడా ఆ దేశమే. జో బైడెన్ హయాంలో ఇవన్నీ జరిగినట్టు తెలిసినా, ట్రంప్ ఏమీ తెలియనట్టు నటించారు. ఉక్రెయిన్నే వేలెత్తి చూపారు. ఇప్పుడు రాంఫోసాతో సైతం అదే తరహాలో వ్యవహారం నడిపారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల ఊచకోత సాగుతున్నదనీ, వాటిల్లో చాలాభాగం బయటకు రావటం లేదనీ ట్రంప్ వాదించారు. ఒకప్పటి శ్వేతజాతి పాలనలో నల్లజాతీయులపై అఘాయి త్యాలు జరిగాయని ఒప్పుకుంటూనే ఇప్పుడు నల్లజాతి పాలనలో శ్వేతజాతీయుల్ని ఆ మాదిరేహింసిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీ వద్ద ఆధారాలున్నాయా అని రాంఫోసా అడిగితే, లేవని అంగీ కరిస్తూనే ట్రంప్ ఒక వీడియో ప్రదర్శించారు. అందులో నల్లజాతి వామపక్ష నాయకుడు జూలియస్ మలేమా ‘శ్వేతజాతి ఆఫ్రికన్లను హతమార్చండ’ంటూ నినాదాలిస్తున్న దృశ్యాలు కనబడ్డాయి. మొత్తం గంటసేపు జరిగిన ఈ మీడియా సమావేశంలో రాంఫోసా ఎక్కడా ఆవేశానికి పోకుండాఎంతో సంయమనంతో ట్రంప్కు జవాబిచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి దక్షిణాఫ్రికాలో ఇప్పటికీ నాలుగింట మూడొంతుల వ్యవసాయ భూములు 8 శాతంకన్నా తక్కువ జనాభాగల శ్వేతజాతీయుల చేతుల్లో వున్నాయి. జనాభాలో 80 శాతంగా వున్న నల్లజాతీయులకు వ్యవసాయ భూముల్లో వాటా కేవలం 4 శాతం మాత్రమే. కానీ ట్రంప్ మాత్రం దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేతజాతీయుల భూముల్ని గుంజుకుని వాటిని నల్లజాతీయులకు పంచు తున్నదని ఆరోపించారు. శ్వేతజాతి దురహంకార పాలనలో నల్లజాతీయుల నుంచి అక్రమంగా చేజిక్కించుకున్న భూములు వెనక్కిప్పించాలని స్థానికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా అక్కడి ప్రభుత్వం అంగీకరించటం లేదు. దానికి బదులు స్వచ్ఛందంగా అమ్మటానికి సిద్ధపడే శ్వేత జాతీయులకు పలు రాయితీలిస్తున్నది. శ్వేతజాతి రైతుల ఊచకోత సాగుతున్నదన్న ట్రంప్ వాదన కూడా పూర్తి అబద్ధం. నేరాల రేటు చూస్తే ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా ముందుంది. అక్కడ సగటున రోజుకు 72 హత్యలు జరుగుతాయి. ఆరుకోట్ల జనాభాగల ఆ దేశంలో హతుల్లో అత్యధికులు నల్లజాతీయులు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుడు 26,232 మంది హత్యకు గురైతే అందులో కేవలం 8 మంది మాత్రమే శ్వేతజాతి రైతులు. వాస్తవాలు ఇవికాగా ట్రంప్ వైట్హౌస్ వేదికగా ఒక దేశాధినేతపై ప్రపంచమంతా చూస్తుండగా దబాయించటం ఎంత దారుణం! నిజానికి రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకోవాల్సినవి చాలావున్నాయి. శ్వేతజాతి రైతుల ఊచకోత ప్రచారాన్ని నమ్మటంతో బైడెన్ హయాంలోనే నిధులు ఆపేశారు. ట్రంప్ వచ్చాక 25 శాతం సుంకాల విధింపును ప్రకటించారు. ఆ దేశంలోని సహజ వనరులపై ట్రంప్ కన్నుపడింది. వీటిపై అర్థవంతమైన చర్చలు జరగకుండానే తప్పుడు ప్రచారంపై వాదులాట సాగింది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచ కోతపై ధైర్యంగా అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టింది దక్షిణాఫ్రికాయే. రాంఫోసా అదృష్టం బాగుండి ట్రంప్కు ఆ సంగతి గుర్తురాలేదు. లేకుంటే మరింతగా విరుచుకుపడేవారు. వర్తమాన ప్రపంచంలో పలు దేశాధినేతలు తప్పుడు సమాచారాన్నీ, వదంతుల్నీ ప్రచారంలో పెట్టి అధికారంలోకొచ్చినవారే. ఈ ఎత్తుగడలే మరోసారి అందలం ఎక్కిస్తాయని... రాజ్యాంగాన్ని సవరించి మూడోసారి అధ్యక్షుడు కావాలని కలగంటున్న ట్రంప్ విశ్వసిస్తున్నారు. ఇలాంటపుడు అమెరికాలో అడుగుపెట్టడానికీ, ట్రంప్తో చీవాట్లు తినటానికీ ఏ దేశాధినేతయినా ధైర్యం చేయగలరా? -
మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం
-
ట్రంప్.. మళ్లీ అదే తీరు!
వాషింగ్టన్: కొన్ని వారాల క్రితం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. సాదరంగా ఆహా్వనించి నిందారోపణల బురద కుమ్మరించడం అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచమీడియా తీవ్రంగా మందలించినా ట్రంప్ తన తెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని బుధవారం మరోసారి రుజువైంది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్హౌస్కు విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసాకు ట్రంప్ ఆరోపణలతో స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికాలో వేలాది మంది శ్వేతజాతి రైతులను వధించారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో హతాశుడైన రమఫొసా వెంటనే తేరుకుని ట్రంప్కు దీటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే? శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో సంయుక్తంగా మాట్లాడేందుకు రమఫొసా సిద్ధంకాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద టెలివిజన్లో ఒక వీడియో చూపిస్తాం చూడండని అక్కడి వారందరినీ ఆదేశించారు. ‘‘శ్వేతజాతీయులను చంపేయండి. శ్వేతజాతి రైతులను కాల్చిచంపండి’’ అంటూ దక్షిణాఫ్రికాలో చిన్నపాటి కమ్యూనిస్ట్పార్టీ అయిన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రమఫొసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ‘‘ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారనేది ఒట్టిమాట. వాస్తవానికి వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేతజాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేతజాతీయులు బతుకుజీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలసవచ్చారు. వాళ్లకు మేం ఆశ్రయం కల్పించాం’’ అంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు. శ్వేతజాతీయుల అవస్థలు ఇవి అంటూ విదేశీ వార్తాసంస్థల్లో ప్రచురితమైన కథనాల జిరాక్స్ కాపీలను మీడియా ప్రతినిధులకు చూపించి రమఫొసాకు అందజేశారు. వీటికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్చేశారు. ‘‘ అన్ని హత్యలే. దక్షిణాఫ్రికాలో ఎక్కడ చూసినా మరణాలే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రమఫొసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నాసరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. ‘‘ అసలేంటీ వీడియో?. నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిదీ వీడియో?. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం?’’ అంటూ ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాదిమంది నల్లజాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. మా దేశంలో శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికనర్స్గా పిలిచే మైనారిటీ శ్వేతజాతీయులే చాన్నాళ్లు మా దేశాన్ని చెండుకు తిన్నారు. ఆఫ్రికన్ల దీనగా«థను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుంది.’’ అని రమఫొస సూటిగా సమాధానం ఇచ్చారు. ట్రంప్ చూపిన వీడియోలో ఒక రోడ్డు పక్కన చోట పెద్ద సంఖ్యలో సమాధులు ఉన్నాయి. అయితే ఇవి నిజమైన సమాధులు కావని, 2020లో ఖ్వజూలు–నటాల్ ప్రావిన్సులో ఒక రైతు జంట పొలంలో హత్యకు నిరసనగా ఏర్పాటుచేసిన నకిలీ సమాధులు అని కొందరు వాదించారు. ఉంటే ఇచ్చేవాడినే శ్వేతజాతి, నల్లజాతీయుల్లో ఎవరు పీడనకు గురయ్యారని ఓవైపు ట్రంప్, రమఫొసా వాదించుకుంటుంటే ఒక విలేకరి మధ్యలో కల్గజేసుకుని వందల కోట్ల రూపాయల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంత వరకు నైతికతగా అనిపించుకుంటుంది? అని ట్రంప్ను సూటి ప్రశ్న వేశారు. దీంతో చిర్రెత్తికొచ్చిన ట్రంప్.. ‘‘ నువ్వో చెత్త రిపోర్టర్వు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోల ఏంటి?. నువ్వు అసలు ప్రశ్నలు అడగొద్దు’’ అని అతనిపై ట్రంప్ అరిచాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ను కూల్ చేసేందుకు రమఫొసా మధ్యలో కలుగజేసుకున్నారు. ‘‘ ఖతార్ మాత్రమే కాదు. కావాలంటే మేం కూడా మీకు విమానాన్ని బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు. దీనికి ట్రంప్ వెటకారంగా బదులిచ్చారు. ‘‘ అగ్రరాజ్యమైన అమెరికాకే ఎయిర్ఫోర్స్వన్గా కొత్త విమానాన్ని ఇచ్చే దమ్ముంటే మీరూ ఇవ్వొచ్చు. నేను తీసుకునేందుకు రెడీ’’ అని అన్నారు. వెంటనే రమఫొసా ‘‘ అగ్రరాజ్యంగా ఉండి కూడా మీరు ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉన్నా.. ఇచ్చే స్థితిలో మేం లేము. మా వద్ద అసలు విమానమే లేదు’’ అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ఘొల్లున నవ్వేశారు. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ)కు చెందిన సిరిల్ రామఫోసా(71) మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది. దీంతో, డెమోక్రాటిక్ అలయెన్స్, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏఎన్సీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. శుక్రవారం పార్లమెంట్లో జరిగిన ఎన్నిక లో రామఫోసాకు 283 ఓట్లు పడగా, ప్రత్యర్థి మలేమాకు 44 ఓట్లే ద క్కాయి. రామఫోసా బుధవారం అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. -
మండేలా పార్టీకి ఎందుకీ ఎదురుదెబ్బ?
1994లో స్థాపితమైనప్పటినుంచీ 30 ఏళ్లపాటు అప్రతిహతంగా దక్షిణాఫ్రికాను ఏలిన ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’(ఏఎన్సీ) తొలిసారి పూర్తి మెజారిటీని అందుకోలేకపోయింది. ఇప్పటికీ అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అదే అయినప్పటికీ(400కు 159) క్రమంగా తగ్గుతున్న ఓట్ల శాతం ప్రజల్లో పెరుగుతున్న నిరాదరణకు రుజువు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ నెల్సన్ మండేలా నెలకొల్పిన ఈ పార్టీ ప్రభుత్వాల అధినేతల అవినీతి, అసమర్థ పాలన ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. ఒకప్పుడు మొత్తం ఆఫ్రికాలోనే మొదటి స్థానంలో ఉండిన ఆర్థిక వ్యవస్థ నైజీరియా తర్వాత రెండవ స్థానానికి పడిపోయింది. ఈ పరిణామాలను గమనించినప్పుడు ఈరోజున ఏఎన్సీ తన మెజారిటీని కోల్పోవటంలో ఆశ్చర్యం కనిపించదు.దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీ ఓటమి ఆశ్చర్యంగా తోచవచ్చు గానీ, ముందుగా ఊహించనిదేమీ కాదు. శ్వేతజాతీయుల వర్ణ వివక్ష వ్యవస్థ (అపార్థీడ్) మీద సుదీర్ఘ ఉద్యమం విజయవంతమైన తర్వాత 1994లో అధికారానికి వచ్చిన ఏఎన్సీ, తన వైఫల్యాల కారణంగా ప్రజాదరణను కోల్పోవటం ఒక దశాబ్ద కాలమైనా తిరగకముందే మొదలైంది. ఇప్పటికి సరిగ్గా 16 సంవత్సరాల క్రితం 2003 జూన్లో నేను దక్షిణాఫ్రికాను సందర్శించే నాటికే ఈ అసంతృప్తి వివిధ వర్గాలలో కనిపించసాగింది. కానీ ఆ తర్వాత మరొక అయిదేళ్లు జీవించి ఉండిన నెల్సన్ మండేలా గానీ, తన ఉద్యమ సహచరులుగా పోరాటాలు జరిపి ప్రభుత్వ నాయకత్వాలలోకి వచ్చినవారు గానీ పరిస్థితిని సరిదిద్దలేదు. దేశాధ్యక్ష పదవిని 1999లో వదులుకున్న మండేలా ఏకాంత జీవితంలోకి వెళ్ళిపోగా, ప్రభుత్వాలను నడిపినవారు అవినీతి మార్గాలను పట్టారు. ఉద్యమ కాలంలో హామీ ఇచ్చిన జనరంజక పాలనను, సంస్కరణలను కాగితాలపై తప్ప ఆచరణలో చూపించింది స్వల్పం. అందుకు ప్రజల నిరసన కనిపించటం కొంతకాలం క్రితమే మొదలుకాగా, ఇపుడది 30 ఏళ్ళలో మొదటిసారిగా అసలు మెజారిటీయే కోల్పోయింది.దక్షిణాఫ్రికా గురించి బయటికి బాగా ప్రచారం పొందిన సమస్య వర్ణ వివక్ష. అటు వివక్ష తెల్లవారు పాలించిన ఇతర ఆఫ్రికన్ వలస దేశాలలో కూడా ఉండగా, ఇక్కడ దానిని చట్టబద్ధంగా వ్యవస్థీకృతం చేశారు. అదే సమయంలో దేశంలోని భూమి, గనులు, పరిశ్రమలు, వ్యాపారాలు, ఉద్యోగాల వంటి సమస్త వనరులు తెల్లవారి అధీనంలోనే ఉండిపోయాయి. అటువంటి స్థితిలో, అపార్థీడ్ వ్యవస్థ రద్దయినప్పటికీ ఈ వనరులపై తెల్లవారి ఆధిపత్యం పోయి, ఆర్థిక సంస్కరణలు జరిగి, నల్లవారికి తమ జనాభాకు తగినట్లు అవకాశాలు లభిస్తే తప్ప పేదరికం పోదు, అపార్థీడ్ వ్యతిరేక పోరాటానికి నిజమైన సార్థకత లభించదు. వాస్తవానికి ఉద్యమకాలంలో ఈ లక్ష్యాలన్నీ ఏఎన్సీ అజెండాలో ఉన్నవే. ఆ పార్టీపై తమ సొంత ఆలోచనలతో పాటు వివిధ ప్రజాస్వామిక దేశాలు, సోషలిస్టు దేశాల అభ్యుదయ భావాల ప్రభావాలు ఉండేవి. కానీ అధికారానికి వచ్చిన అనంతరం ఎక్కువకాలం గడవకుండానే పరిస్థితులు మరొకవిధంగా మారసాగాయి. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే మండేలా స్వయంగా అధ్యక్షునిగా ఉండిన 1994–99 కాలంలో సైతం ప్రభుత్వ బాధ్యులలో పలువురి తీరు మారటం, మండేలా తన మెతకదనం వల్ల నిస్సహాయునిగా మిగిలిపోవటం జరిగింది. ఆయన తన శేష జీవితం అయిదేళ్లు ఒంటరిగా గడపటం అందువల్లనేనన్నది కొందరి పరిశీలకుల అభిప్రాయం. అపార్థీడ్ వ్యవస్థ రద్దయిన మాట నిజం. అందువల్ల నల్లవారు స్వేచ్ఛగా తిరగగలగటంతో పాటు బీచ్లు, క్లబ్బులు, హోటళ్ల వంటి ప్రదేశాలలోకి వారి ప్రవేశంపై నిషేధాలు తొలగిపోయాయి. పోలీస్ నిర్భంధాలు లేని కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నల్లవారి పిల్లలకు విద్యావకాశాలు లభించటం మొదలైంది. కొంత వైద్యం, చదువులతో పాటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు వచ్చాయి. నల్లవారికి తెల్లవారు తమ వ్యాపారాలలో చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వసాగారు. అపార్థీడ్తో పాటు తమ రాజ్యం పోయిందనీ, అందువల్ల కొన్ని రాజీలు తప్పవనీ వారికి అర్థమైంది. నల్లవారు కూడా కొద్దిస్థాయిలో వ్యాపారాలు మొదలుపెట్టారు. పెద్ద హోదా గల ప్రభుత్వ ఉద్యోగాలు కొన్నింటిని తెల్లవారికి, నల్లవారికి మధ్య రొటేట్ చేయసాగారు. ఈ మార్పులు నల్లవారిలో ఒక చిన్న మధ్యతరగతి సృష్టికి అవకాశం కల్పించాయి. ఈ విధంగా వారికి క్రమంగా ఆత్మవిశ్వాసం రావటం మొదలైంది. అపార్థీడ్ రద్దువల్ల ఇప్పుడు రాజకీయాధికారమంతా తమదే కావటం సరేసరి. ఇటువంటివి సానుకూల పరిణామాలని వేరే చెప్పనక్కరలేదు. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయాలు మూడున్నాయి. ఒకటి, యథాతథంగా నల్లవారి సమస్యలతో, వారి జనాభాతో పోల్చినపుడు ఈ మార్పులు చాలా స్వల్పం. రెండవది, మొదట చెప్పుకున్నట్లు ఆర్థిక వనరులన్నీ, ఆర్థిక కార్యకలాపాలన్నీ అత్యధిక భాగం తెల్లవారి అధీనంలోనే ఉండిపోవటం. ఉదాహరణకు నేనక్కడ ఉండినపుడు చూసిన అధికారిక ప్రచురణల ప్రకారం, గ్రామీణ భూములు నల్లవారి నుంచి తెల్లవారి చేతిలోకి అపార్థీడ్ రద్దయిన తర్వాత సైతం ఇంకా బదిలీ అవుతూనే ఉన్నాయి. నల్లవారికి తమ వ్యవసాయం కోసం ఎటువంటి సహాయాలు లభించకపోవటం, గ్రామాలలో ఇతరత్రా ఉపాధి అవకాశాలు సన్నగిల్లటంతో వారు భూములు అమ్ముకొని, పొట్ట పోసుకునేందుకు నగరాలకు తరలిపోతున్నారు. నేను స్టెల్లెన్ బాష్ అనే నగరం వద్ద గల ఒక షాంటీ టౌన్ను చూశాను. నగరంలో నల్లవారు రోజంతా పనులు చేసుకుని సాయంత్రానికి వెళ్లిపోయి ఉండే ప్రాంతాన్ని షాంటీ టౌన్ అంటారు. అక్కడ అన్ని నివాసాలు, ఆ ప్రాంతం చుట్టు కట్టే కంచె అన్నీ ఇనుప రేకులతోనే. కొన్ని వేలమంది నివసిస్తారు. స్టెల్లెన్ బాష్కు దక్షిణాఫ్రికాలో గాంధీజీ కార్యకలాపాలతోనూ సంబంధం ఉండేది. ఇటువంటి టౌన్షిప్లు గతంలోనూ ఉండగా, అపార్థీడ్ ముగిసిన తర్వాత ఇంకా పెరుగుతున్నాయి. నల్లవారు అధికారానికి వచ్చిన తర్వాత, టూరిజానికి ప్రోత్సాహం పేరిట ఒక్కొక్క కంపెనీకి వేలకు వేల హెక్టార్లు స్థానిక తెల్లవారికి, విదేశీయులకు దీర్ఘకాలపు లీజుకు అప్పగించారు. ఆ భూములన్నీ స్థానిక తెగలవి. వారు భూములు కోల్పోయి ఈ కంపెనీలలో కూలీలుగా పని చేస్తున్నారు. ఇది నా ప్రత్యక్షానుభవం. దేశానికి ఉత్తర ప్రాంతాలలో విస్తారమైన భూములు ఆ విధంగా నల్లవారికి నష్టమయ్యాయి. నేను చూసిన ఉదాహరణ ఇండియాకు చెందిన విజయ్ మాల్యా 20,000 ఎకరాలకు పైగా భూమిలో నిర్వహిస్తున్న మబూలా లాడ్జ్ రిసార్ట్. దాని వివరాలు అనేకం ఉన్నా ఇక్కడ అప్రస్తుతం. ఇక మూడవ విషయం, ప్రభుత్వ నేతల అదుపులేని అవినీతి. అది చాలదన్నట్లు అసమర్థ పాలన. వీరంతా ఉద్యమ కాలపు అగ్రనేతలే. రెండు ఉదాహరణలు చూడండి. స్వయంగా మండేలా భార్య విన్నీ మండేలా ఉద్యమకాలం నుంచే అవినీతికి పాల్పడి, అపార్థీడ్ రద్దు తర్వాత జైలుకు వెళ్లింది. ప్రస్తుత అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు ముందు అధ్యక్షుడిగా ఉండిన జేకబ్ జుమా కూడా జైలుకు వెళ్లినవాడే. ఇతర పదవులలో ఉన్నవారి సంఖ్యకు లెక్కలేదు. ప్రస్తుత అధ్యక్షుడు వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాకున్నా ఆ సమస్యను అరికట్టలేదు. మొత్తంమీద వీరందరి అసమర్థ పాలన కారణంగా విద్యుత్, మంచినీళ్లు, విద్యావైద్యాలు, తీవ్ర నిరుద్యోగం, వివిధ పౌర సదుపాయాల సమస్యలు పెరగటం మొదలైంది. ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనపడుతుండటం వల్ల, ఒకప్పుడు మొత్తం ఆఫ్రికాలోనే మొదటి స్థానంలో ఉండిన వ్యవస్థ కొన్నేళ్ల క్రితమే నైజీరియా తర్వాత రెండవ స్థానానికి పడిపోయింది. ఈ పరిణామ క్రమాలను గమనించినపుడు ఈరోజున ఏఎన్సీ తన మెజారిటీని కోల్పోవటంలో ఆశ్చర్యం కనిపించదు. ఏఎన్సీ ఓట్లశాతం 57.5 (2019) నుంచి 40.2కు తగ్గింది. 400 బలం గల నేషనల్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 230 నుంచి 159కు పడిపోయింది. కనుక ఇతరులతో పొత్తు తప్పదు. రెండవ స్థానంలో గల డెమోక్రటిక్ అలయన్స్ తెల్లవారిది. అందువల్ల విధానాల సమస్య ఉంటుంది. మూడవ స్థానంలో గల మాజీ అధ్యక్షుడు జేకబ్ జుమా(ఏఎన్సీ తరఫున దేశాధ్యక్షుడిగా ఉండిన జుమా మద్దతుతో కొత్త పార్టీ ఏర్పడింది) అవినీతి కేసులో జైలుకు వెళ్లినవాడు. అనగా, ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తులు కూడా సమస్య కానున్నాయన్నమాట. అంతిమంగా తేలుతున్నది దక్షిణాఫ్రికా ప్రజల సమస్యలు సమీప భవిష్యత్తులో తీరేవి కాదని!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
రామఫోసా గద్దెదిగే ప్రసక్తే లేదు: ఏఎన్సీ
కేప్ టౌన్: దక్షిణాఫ్రికా ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోయినా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా రాజీనామా చేయబోరని పార్టీ స్పష్టం చేసింది. ఐక్య కూటమి ఏర్పాటు చేసి ఆయన సారథ్యంలోనే స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని పేర్కొంది. ఎన్నికల్లో ఏఎన్సీకి 40 శాతం, డెమొక్రటిక్ అలయెన్స్కు 20 శాతం, మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సారథ్యంలోని ఎంకే పార్టీకి 14 శాతం ఓట్లు రావడం తెలిసిందే. 1994లో వర్ణ వివక్ష అంతమైన ఎన్నికలు జరిగినప్పటి ఏఎన్సీకి మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి. -
ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకలు వారి మనసుల్ని దోచుకున్నాయి. భారతీయ సాంస్కృతిక వైవిధ్యం, ఘనమైన వారసత్వం ఉట్టిపడే కళారూపాలు, సంప్రదాయ వస్తువుల్ని కానుకగా ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు మన తెలంగాణలో తయారైన కళాకృతులైన కూజా ఆకారంలో ఉండే రెండు పింగాణి పాత్రలను (సురాహి) కానుకగా ఇచ్చారు. కర్ణాటకకు చెందిన బిద్రీ అనే లోహకళతో రూపొందించే ఈ పాత్రలపై వెండితో నగిషీలు చెక్కారు. సిరిల్ సతీమణికి నాగాలాండ్లో ఆదివాసీలు తయారు చేసిన శాలువాను బహుమానంగా ఇచ్చారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లాలూ డా సిల్వాకు మధ్యప్రదేశ్కు చెందిన గోండ్ పెయింటింగ్స్ను కానుకగా ఇచ్చారు. గ్రీసు ప్రధాని కరియాకోస్కు ఛత్తీస్గఢ్ కళాకృతులైన ఇత్తడితో తయారు చేసిన డోక్రాను, ఆయన సతీమణికి మేఘాలయలో తయారైన శాలువాను కానుకగా ఇచ్చారు. -
మోడల్స్పై గ్యాంగ్ రేప్.. 67 మంది అరెస్ట్
జోహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలో అక్రమ చొరబాటుదారులు పైశాచికానికి తెగబడ్డారు. మ్యూజిక్ వీడియో షూట్లోకి ఆయుధాలతో చొరబడి.. మోడల్స్పై గ్యాంగ్ రేప్నకు పాల్పడ్డారు. అంతేకాదు.. మగవాళ్ల దుస్తులు ఊడదీసి.. వాళ్లతో డ్యాన్సులు చేయించి మరీ పైశాచిక ఆనందం పొందారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్బర్గ్ పశ్చిమంగా ఉన్న క్రూగర్స్డ్రాప్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నిందితులను జామా జామాలుగా గుర్తించిన జోహెన్నెస్బర్గ్ పోలీసులు.. అక్రమ మైనింగ్ కోసం పొరుగు ప్రాంతాల నుంచి అక్రమంగా చొరబడతారని, తరచూ దోపిడీలకు పాల్పడతారని వెల్లడించారు. వాళ్లు దాడి చేసింది దోపిడీ కోణంలోనే అయినా.. మోడల్స్ కనిపించేసరికి అత్యాచారానికి తెగబడ్డారని, ఇలా జరగడం ఇదే మొదటి ఘటన అని పోలీసులు తెలిపారు. బాధితులంతా 35 ఏళ్ల లోపువాళ్లేనని తెలుస్తోంది. ఆపై మగవాళ్లతో నగ్న నృత్యాలు చేయించి.. వాళ్ల దగ్గర ఉన్న సొమ్ము, నగలను దోచుకెళ్లారు. గుంపుగా దుండగులు దాడి చేసినట్లు బాధితులు వెల్లడించగా.. 67 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో చాలామంది అక్రమ చొరబాటులేనని నిర్ధారించారు. ఇక ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా స్పందించారు. అలాంటి మృగాలకు బతికే హక్కు లేదని, కఠిన శిక్ష విధించి తీరతామని తెలిపారు. -
ముంచెత్తిన వరదలు.. 259 మంది మృతి
కేప్టౌన్: దక్షిణాఫ్రికాను వరదలు ముంచెత్తాయి. డర్బన్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వరదల కారణంగా ఇప్పటివరకు 259 మంది మరణించారు. రోడ్లు, వంతెనలు, భవనాలు కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్వాజూలు నేటల్ రాష్ట్రంలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలు బీభత్సం సృష్టించిన డర్బన్ ప్రాంతాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సందర్శించారు. ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమని పేర్కొన్నారు. (చదవండి: మత్స్య జాతులు మాయం!)