breaking news
china manza
-
"చైనా మాంజాకు మరో ప్రాణం బలి"
చైనా మంజా వాడకంపై ప్రజలకు ఎంత అవగాహన కల్పించిన తీరు మార్చుకోవడం లేదు. పండగ వేళ సరదాగా ఎగరవేసే పతంగులు కొంతమంది పాలిట మృత్యపాశాల్లా మారుతున్నాయి. తాజాగా కర్ణాటకాలో చైనా మాంజాతో తీవ్రగాయాలై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో పండగ వేళ ఆకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎగురవేయడం హిందూ సంప్రదాయంలో భాగం. అందుకే దేశవ్యాప్తంగా పెద్ద, చిన్నా తేడా లేకుండా పతంగులు ఎగురవేసి తమ సంతోషాన్ని చాటుకుంటారు. పతంగులు ఎగురవేయడం కోసం వాడే చైనా మాంజా వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురవడంతో పాటు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పక్షులసైతం పెద్దఎత్తున మాంజా దారం తగిలి మరణిస్తున్నాయి. దీనిపై ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా తీరుమారడం లేదు.కర్ణాటక బీదర్ జిల్లా తలమడిగి బ్రిడ్జి వద్ద సంజూ కుమార్ అనే ఓవ్యక్తి బైక్ నడుపుతూ వస్తుండంగా రోడ్డుపై ఉన్న చైనా మంజా అతని ముఖానికి తగిలింది. దీంతో తలకు తీవ్రగాయాలైన సంజూ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలారు. అతికష్టంమీద వారి కుమార్తెకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. అంతలోనే అక్కడే ఉన్న స్థానికులు రక్తం ఎక్కువగా పోకుండా కాటన్ గుడ్డ కట్టి అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంజూకుమార్ అంబులెన్స్ వచ్చే సరికే ప్రాణాలు వదిలారు.అయితే అంబులెన్స్ సమయానికి చేరుకుంటే ఆయన ప్రాణాలు దక్కేవని సంజూ కుమార్ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పతంగిలు లేపడానికి చైనా మాంజా వాడకుండా నిషేదం విధించాలని అక్కడే ధర్నా చేపట్టారు. ఇటీవల చైనా మాంజాతో ప్రమాదానికి గురైన ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. -
ఏపీలో సీజ్ ద కైట్!
పతంగులకు కట్టిన దారం.. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ మాంజా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే.. పలువురి ప్రాణాలు బలిగొందీ భూతం. ఈ పండుగ సీజన్లోనే ఇరు చోట్ల చైనీస్ మాంజా ధాటికి పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. దీంతో నిషేధిత మాంజా అమ్మకాలు, వాడకంపై కఠిన చర్యలు అమలు కావడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అటు పోలీసు శాఖలు చేపడుతున్న డ్రైవ్స్.. అరకొర ఫలితాలనే ఇస్తున్నాయి.. తెలంగాణలో చైనీస్ మాంజా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్లో మాంజా చుట్టుకుని ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు. హైదరాబాద్లో ఈ ప్రమాదాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకొక ఘటన చోటు చేసుకుంటోంది. చైనా మాంజా అమ్మినా.. కొన్నా.. ఆఖరికి ఆ మాంజాతో గాలి పటాలు ఎగరేసినా కేసులు పెడుతామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆఖరికి పీడీ యాక్టు ప్రయోగిస్తామన్న ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగానే..హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. చైనీస్ మాంజా విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారు.. ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాల తాలుకా వివరాలతో పూర్తి నివేదికను ఫిబ్రవరి 26వ తేదీలోపు అందజేయాలని కమిషన్ ఆయన్ని ఆదేశించింది.ఇటు ఏపీలోనూ చైనీస్ మాంజా విషయంలో పోలీసులు చేస్తున్న ప్రకటనలకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనీస్ మాంజా అమ్మినా.. కొన్నా.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో 112కి డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైజాగ్ పోలీసులు మరో అడుగు ముందుకేసి.. చైనీస్ మాంజా ఉన్న 650 గాలి పటాలను సీజ్ చేశారు. మరికొన్ని జిల్లాల్లోనూ పోలీసులు అమ్మేవారిని ఏం చేయలేక.. కొనేవారిని, ఎగరేసే వారిని పట్టుకుని వాళ్ల చేతుల్లోని గాలి పటాలు సీజ్ చేస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. చైనీస్ మాంజాలో.. సింథటిక్ పదార్థాలతో(నైలాన్, ప్లాస్టిక్) తయారు చేసి.. గాజు లేదంటే లోహపు పొరతో దారానికి పూత పూస్తారు. అందుకే ఇది తీవ్రమైన గాయాలు చేస్తుంది. పైగా ఇది పర్యావరణానికి హానికరం(బయోడిగ్రేడబుల్ కాదు). అందుకే భారత ప్రభుత్వం 2017లో చైనా మాంజా (Chinese Manjha)పై నిషేధం విధించింది. తొలుత ఇది చైనా నుంచి దిగుమతి అయ్యేది. అలా దానికి చైనీస్ మాంజా, చైనా మాంజా అనే పేర్లు స్థిరపడిపోయాయి. ఆ తర్వాతి కాలంలో మన దేశంలోనే దీనిని తయారుచేయడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీయల్ అవసరాల కోసం తయారీకి మినహాయింపు ఇచ్చారు. ఇదే అదనుగా కాసుల కక్కుర్తితో చైనీస్ మాంజాను మార్కెట్లలోకి తెస్తున్నారు. చైనా మాంజా తయారీ.. నిల్వ.. విక్రయం(అమ్మడం) నేరం. ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదంటే రూ.1 లక్ష వరకు జరిమానా ఒక్కోసారి రెండూ విధించవచ్చు. వినియోగం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం.. చైనీస్ మాంజా కారణంగా ప్రమాదాల బారిన పడ్డవాళ్లు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు. -
చైనా మాంజా.. ASI మెడకు తీవ్ర గాయం
సాక్షి, ఉప్పల్: హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నా నిషేధిత చైనా మాంజా వాడకం మాత్రం తగ్గడం లేదు. సంక్రాంతి నేపథ్యంలో వరుస మాంజా ప్రమాదాలు.. వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉప్పల్లో మాంజా తగిలి.. ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయమైంది. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై వివరాల మేరకు.. నగరంలోని నల్లకుంట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు మాంజా కారణంగా గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పీఎస్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్ర గాయామైంది. వెంటనే ఆయనను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇక, అంతకుముందు.. హైదరాబాద్లోని గచ్చిబౌలి నుంచి హఫీజ్పేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చైతన్య అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేతికి మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయన చేయి తెగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మాదాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, అవగాహన లోపంతో కొందరు వినియోగిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో మాంజా తెగి రోడ్లపై గాలిలో వేలాడుతూ వాహనదారులకు ముప్పుగా మారుతోంది. చైనా మాంజా కారణంగా గతంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. -
గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. సజ్జనార్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజా జనం ప్రాణాలు తీస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం నింపుతోంది. విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. పతంగుల పండగ నేపథ్యంలో ‘గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు’ అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది. మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు. నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు. పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి కాదు’ అంటూ సజ్జనార్ హెచ్చరించారు.కాగా, చైనా మాంజా విక్రయంపై నగర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీని వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో, జాతీయ హరిత ట్రైబ్యునల్ 2017లో నిషేధించింది. అయినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో నెల రోజులుగా నిఘా ఉంచిన అధికారులు ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6226 బాబిన్ల మాంజా స్వాధీనం చేసుకున్నారు.గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు!చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది.మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు.నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు.పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి… pic.twitter.com/wrsYH1yXOr— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 11, 2026ఇవాళ(జనవరి 11, ఆదివారం) హైదరాబాద్లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్పై వెళ్తున్న సాయి వర్దన్ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. -
చైనా మాంజా.. సిటీలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్పై వెళ్తున్న సాయి వర్దన్ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో జరిగినట్టు తెలిసింది. మరోవైపు.. శుక్రవారం కూడా చైనా మాంజా కారణంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన సభావల్ మధు శుక్రవారం హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బైక్పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో సాగర్ హైవేపై మాల్ మార్కెట్లో విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చైనా మాంజా చేతి వేళ్లకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు యాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి.. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యాపారి వివరాలపై ఆరా తీశారు. -
చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసుల ఉక్కు పాదం
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజా విషయంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దారాన్ని అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. తాజాగా భారీగా నిషేధిత మాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది. ఇండస్ట్రీయల్ అవసరం కోసం తయారైన దారాన్ని మాంజాగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇక మీదట నగరంలో అమ్మినా.. కొన్నా.. ఆ దారంతో పతంగులు ఎగరేసినా కేసులు పెడతాం. చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలైనా కేసులు పెడతాం. చైనా మాంజా విషయంలో పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం అని సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాపై బ్యాన్ ఉన్నప్పటికీ.. సంక్రాంతి సీజన్కు ఉన్న మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని దుకాణాదారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు చనిపోతున్నాయి. తాజాగా.. నగరంలో అధికారులు పట్టుకున్న మాంజా విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. చైనా మాంజా తయారు చేస్తున్న రెండు ఫ్యాక్టరీలను సీజ్ చేసినట్లు.. గుజరాత్, రాజస్థాన్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ మాంజా ఫ్యాక్టరీలపై పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
గొంతు కోసిన మాంజా.. యువకుడికి 19 కుట్లు!
-
HYD:చైనా మాంజా తగిలి టెకీకి గాయాలు
సాక్షి,హైదరాబాద్:నగరంలో నిషేధిత చైనా మాంజా తగిలి మరొకరికి గాయాలయ్యాయి. ఉప్పల్ డీఎస్ఎల్ కంపెనీ భవనంలోని బైక్పై వెళ్తుండగా ఘటన జరిగింది. మాంజా దారం తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయివర్థన్రెడ్డి కింద పడిపోయారు. దీంతో అతడి మెడకు గాయమైంది. గాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సాయివర్ధన్రెడ్డి కుషాయిగూడకు చెందినవారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ గాలిపటాలు ఎగురవేసేందుకు ఇప్పటికీ దానిని వాడుతున్నారు. పులువురు వ్యాపారులు పండగ వేళ సొమ్ము చేసుకునేందుకు అక్రమంగా చైనా మాంజా విక్రయాలు సాగిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేయడంలో పక్కవారి మీద పైచేయి సాధించేందుకు చైనా మాంజాను వాడుతున్నారు. చైనా మాంజా వాడిన గాలిపటాలు దారంతో సహా తెగి పడి రోడ్లపై వేలాడుతున్న చోట వాహనదారులు చూసుకోకుండా వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో వారు తీవ్ర గాయాలపాలవుతున్నారు. హైదరాబాద్లో పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో చైనా మాంజా భారీగా పట్టుబడడం గమనార్హం. ఇదీ చదవండి: మీకు తెలియకుండా మీ ఫొటోలు ఇన్స్టాలో -
రూ. 25 లక్షల చైనీస్ మాంజా స్వాధీనం.. బుల్డోజర్తో ధ్వంసం
నేడు దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రీతుల్లో సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో గంగా స్నానం, గాలిపటాలు ఎగురవేడం లాంటివి ఉన్నాయి. మరోవైపు యూపీలోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది.మకర సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలాచోట్ల గాలిపటాలను ఎగురవేస్తారు. అయితే ఈ గాలిపటాలను ఎగురవేసేందుకు వినియోగించే చైనా మాంజా కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు పోయిన సందర్బాలు కూడా ఉన్నాయి.మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో భారీఎత్తున గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఉంది. గాలిపటాలు ఎగురవేసే వారు నైలాన్ దారం లేదా చైనా మాంజాను ఉపయోగిస్తుంటారు. వీటి కారణంగా ప్రాణహాని జరుగుతున్న నేపధ్యంలో నాగ్పూర్ పోలీసులు చైనీస్ థ్రెడ్ వినియోగం, విక్రయాలపై ఓ కన్నేసి ఉంచారు. లక్షల రూపాయల విలువైన చైనీస్ మంజాను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల సాయంతో.. గాలిపటాలు ఎగురవేసేవారిపై నాగపూర్ పోలీసులు నిఘా సారించారు. అదేవిధంగా నగరంలోని ప్రతీవీధివీధినా తిరుగుతూ చైనీస్ దారాన్ని ఉపయోగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.తాజాగా నాగ్పూర్ పోలీసులు రూ.25 లక్షల విలువైన చైనీస్ దారాన్ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేశారు. ఇండోర్ మైదానంలో 2,599 బండిళ్లు కలిగిన దాదాపు రూ.25 లక్షల విలువైన నిషేధిత నైలాన్ మాంజాను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఆ ప్రాంత పౌరుల సమక్షంలో పోలీసులు ఈ విధమైన చర్యలు చేపట్టారు. చైనామాంజా వినియోగిస్తూ ఎవరైనా పట్టుబడితే వారిని నేరుగా కస్టడీకి పంపుతామని పోలీసులు హెచ్చరించారు. చైనీస్ థ్రెడ్ కారణంగా బైక్ రైడర్లు ప్రమాదాల బారిన పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: పతంగులకు ఎంత గాలి అవసరం? ఎందుకు తెగిపోతాయి? -
మాంజా దారానికి బలైన ఆర్మీ జవాన్
-
కపోత విషాద గీతిక!
చైనా మాంజా ప్రాణాంతకంగా మారుతోందనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో మాంజా ఓ వ్యక్తిని బలిగొనడం విషాదాన్ని నింపింది. సోమవారం నగరంలోని నెక్లెస్ రోడ్డులోని విద్యుత్ స్తంభానికి చిక్కుకుపోయిన మాంజా.. పావురం మెడకు చుట్టుకుని నిలువునా దాని ప్రాణాలను తీసింది. ఊపిరి పోతుండగా అది స్తంభంపైనుంచి విగతజీవిగా నేలపై పడుతూ అకటా.. దయలేని వారు ఈ మానవులు! అనే విషాద గీతికను ఆలపిస్తున్నట్లు.. ఆ కపోతం కన్నీరు కారుస్తున్నట్లు కనిపించిందీ దృశ్యం. -
గొంతు కోస్తోంది!
సాక్షి, గుంటూరు: సంప్రదాయ క్రీడలకు ప్రతీక అయిన సంక్రాంతి సమయంలో ఏటా గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. గతంలో గాలిపటాలను ఎగురవేసేందుకు నూలుతో తయారైన దారం (మాంజా) ఉపయోగించేవారు. దీనివల్ల ఎవరికీ.. ఎలాంటి గాయాలయ్యేవి కావు. ఇప్పుడు వీటి స్థానంలో రసాయనాలతో కూడిన చైనా మాంజా వాడకంతో తీవ్ర గాయాల పాలవుతున్న పాదచారులు, వాహన చోదకుల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గాజు పిండి, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసే చైనా మాంజాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించినా మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోంది. కౌశిక్ మృతదేహం (ఫైల్) యథేచ్ఛగా విక్రయాలు చైనా మాంజాలపై నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తోంది. ఇతర గాలిపటాలను చైనా మాంజాతో సులువుగా తెంపవచ్చనే ఉద్దేశంతో ఎక్కువ మంది దీనిపట్ల మొగ్గు చూపుతున్నారు. గాలి పటాలు ఎగిరే సమయంలో ఈ మాంజా విద్యుత్ తీగలు, వృక్షాలకు చిక్కుకుని పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వీటి మనుగడకు పెనుముప్పుగా మారిన చైనా మాంజా వినియోగాన్ని పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాలిపటాలను నియంత్రించే క్రమంలో ఒక్కోసారి ఎగురవేసే వ్యక్తులు కూడా గాయాల పాలవుతున్నారు. - గుంటూరులో సోమవారం తండ్రితో కలసి బైక్పై వెళ్తున్న మూడేళ్ల చిన్నారి కౌశిక్ మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. - గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో చైనా మాంజా గొంతుకు చుట్టుకుని మానవ్ శర్మ (28) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. - 2018లో చైనా మాంజా కారణంగా గుజరాత్లో 16 మంది మరణించడంతో కైట్ ఫెస్టివల్తో పాటు ఈ మాంజా వాడకాన్ని నిషేధించారు. చట్టం ఏం చెబుతోందంటే.. రసాయనాలు పూసిన చైనా మాంజాతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. 2016 మార్చి 4న ఏపీ ప్రభుత్వం, 2016 జనవరిæ 13న తెలంగాణ సర్కారు వీటి విక్రయాలను నిషేధించాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను అమ్మటం, కొనుగోలు చేయడం నేరం. దీన్ని ఉల్లంఘించే వారికి ఐదేళ్లు, అంతకుమించి జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జంతువులు, పక్షులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. చైనా మాంజా తయారీ ఇలా.. దారానికి గాజు పిండి, సగ్గు బియ్యం, గంధకం, రంగులు అద్ది ఉడికించి చైనా మాంజా తయారు చేస్తారు. తమిళనాడులోని ఆరంబాకం, చెన్నైలోని ప్యారిస్, మౌంట్రోడ్డు మొదలైన ప్రాంతాల్లో చైనా మాంజా ఎక్కువగా తయారు చేస్తుంటారు. అక్కడి నుంచి ఏపీలోని పలు జిల్లాలకు సరఫరా అవుతుంది. తమిళనాడు సరిహద్దులో ఉన్న నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట, గుంటూరు నగరంలోని పట్నంబజార్, లాలాపేటలో కూడా చైనా మంజా తయారు చేస్తారు. రాష్ట్రంలోని కర్నూలు చిత్తూరు, కృష్ణా సహా పలు జిల్లాల్లో కుటీర పరిశ్రమగా చైనా మాంజా తయారీ నడుస్తోంది. మనుగడకు ముప్పు చైనా మాంజాతో గాలిపటాలను ఎగురవేయడం వల్ల పక్షులు, జంతువులకే కాకుండా మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతోంది. చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. నూలు దారంతో గాలిపటాలు ఎగురవేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగవు –తేజోవంత్, కార్యదర్శి, హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీ ప్రజల్లో చైతన్యం రావాలి ప్రాణాలు హరిస్తున్న చైనా మాంజాను ఎవరూ వినియోగించకూడదు. జీవోలకే పరిమితం అయిన నిషే«ధాన్ని ప్రభుత్వాలు అమలు చేసి చూపించాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. చైనా మాంజాను స్వచ్ఛందంగా నిరాకరించాలి – గోపాల్ సూరాబత్తుల, వ్యవస్థాపక కార్యదర్శి, యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ఇక కఠిన చర్యలు చైనా మాంజా మెడకు చుట్టుకుని మూడేళ్ల బాలుడు మృతి చెందడం అందరినీ కలచి వేసింది. చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై ఎవరైనా దీన్ని కొనుగోలు చేసినా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులను సైతం అప్రమత్తం చేస్తాం. చైనా మాంజా విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం – ఐ.శామ్యూల్ ఆనంద్కుమార్, కలెక్టర్, గుంటూరు -
తల్లిదండ్రులతో ప్రయాణం.. ఇంతలో..
న్యూఢిల్లీ : చైనా మాంజా ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది. మాంజా కారణంగా ఓ చిన్నారి మృత్యువాత పడింది. ఈ సంఘటన శనివారం న్యూఢిల్లీలోని ఖజుర్ ఖాస్ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇషికా అనే నాలుగున్నర సంవత్సరాల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి హనుమాన్ గుడికి వెళ్లటానికి బైక్పై ప్రయాణిస్తోంది. తండ్రి బైక్ నడుపుతుండగా చిన్నారి అతడి ముందు కూర్చుని ఉంది. బైక్ ఖజుర్ ఖాస్ ఏరియాకు చేరుకోగానే గాల్లోంచి ఎగిరివచ్చిన చైనా మాంజా ఇషిక మెడకు చుట్టుకుంది. అది గమనించని ఆమె తండ్రి వాహనాన్ని ముందుకు పొనివ్వటంతో మాంజా పాప గొంతును కొసేసింది. ఇషిక ఒక్కసారిగా కేకవేయటంతో తల్లిదండ్రులు మెడకు చుట్టుకున్న మాంజాను గుర్తించారు. ఆ వెంటనే రక్తమోడుతున్న పాపను పవేశ్ చంద్రన్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకురావటానికి ముందే చిన్నారి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
స్కూటర్పై వెళ్తుండగా..గొంతు కోసేసింది!
న్యూఢిల్లీ : రాఖీ పండుగ నాడు సంతోషంగా చెల్లెళ్లతో బయల్దేరిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. బైక్పై వెళ్తున్న అతడిని చైనా మాంజా రూపంలో విధి కబలించింది. ఈ విషాదకర ఘటన ఢిల్లీలోని పశ్చిమ విహార్లో చోటుచేసుకుంది. వివరాలు...ఢిల్లీలోని బుద్ధ విహార్కు చెందిన మానవ్ శర్మ(28) సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గురువారం రక్షాబంధన్ సందర్భంగా ఇద్దరు చెల్లెళ్లు అతడికి రాఖీ కట్టారు. అనంతరం ముగ్గురూ కలిసి స్కూటర్ మీద చిన్నమ్మ ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో పశ్చిమ విహార్ ఫ్లైఓవర్పైకి చేరగానే ఓ గాలి పటానికి ఉన్న దారం మానవ్ మెడను చుట్టుకొంది. క్షణాల్లోనే అతడి గొంతును చీల్చివేసింది. దీంతో ముగ్గురూ కిందపడిపోయారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్న ఇతర ప్రయాణీకులు వారిని ఆస్పత్రికి తరలించారు. మానవ్ దారి మధ్యలోనే మరణించగా.. అతడి చెల్లెళ్లు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా మానవ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇక గాలి పటాలు ఎగురవేసేందుకు ఉపయోగించే చైనా మాంజాలు అత్యంత ప్రమాదకరమైనవన్న విషయం తెలిసిందే. వీటి కారణంగా ఎంతో మంది తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఈ క్రమంలో వీటిపై నిషేధం విధించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. -
పాపం పక్షి
సాక్షి,, సిటీబ్యూరో: వినువీధుల్లో స్వేచ్ఛగా విహరించే పక్షులు గాయాలతో రక్తమోడుతున్నాయి. మాంజా యమపాశమై నేలరాలుతున్నాయి. కాలుష్యం, అంతరించిపోతున్న పచ్చదనంతో పాటు మాంజా సైతం జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. అనూహ్యమైన పర్యావరణ మార్పులతో ఇప్పటికే వందలాది పక్షి జాతులు అంతరించాయి. ఊరపిచ్చుకలు, పాలపిట్టలు, వడ్లపిట్టలు, నెమళ్లు, కాకులు, కొంగలు, డేగలు తదితర అనేక రకాల పక్షులు ప్రమాదపు అంచుల్లో మనుగడ కొనసాగిస్తున్నాయి. పక్షుల ప్రాణాలకు ప్రమాదాన్ని మరింత రెట్టింపు చేస్తున్న పతంగుల మాంజా నగర జీవవైవిధ్యానికి ముప్పుగా మారింది. అటవీశాఖ, పోలీసులు, పర్యావరణ నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా చైనా, నైలాన్ మాంజా వినియోగంలో కొంత మార్పు కనిపించినా ప్రమాదం మాత్రం పొంచే ఉంది. మాం జా తాకిడికి గత వారం రోజులుగా 68 పక్షులు గాయపడగా, మరికొన్ని మృత్యువాత పడ్డాయి. ఇవి స్వచ్ఛంద సంస్థల దృష్టికి వచ్చిన వివరాలు. ఇంకా ఎవరి దృష్టిలో పడకుండా ప్రాణాలు కోల్పోతున్న పక్షులు మరెన్నో ఉండవచ్చునని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా ప్రమాదమే... సంక్రాంతి సంబరాల్లో భాగంగా పతంగులు ఎగరవేసేందుకు వినియోగించే మాంజా పక్షుల పాలిట యమపాశంగా మారింది. సీసం పూతతో తయారు చేసే చైనా, నైలాన్ మాంజాలు పండగ రోజుల్లోనే కాదు.. ఆ తర్వాత కూడా పక్షుల ప్రాణాలకు ముప్పుగానే మారుతున్నాయి. చెట్ల కొమ్మల్లో, భవనాలపై కిలోల కొద్దీ పడి ఉంటుంది. ఈ మాంజాను గుర్తించకుండా కొమ్మలపై, ఇళ్లపై వాలేందుకు వచ్చే పక్షులు గాయపడుతున్నాయి.‘ఇలాంటి మాంజా కేవలం సంక్రాంతి రోజుల్లోనే కాదు. ఏడాది పాటు ప్రమాదమే. ప్రతిరోజు ఎక్కడో ఓచోట గాయపడ్డ పక్షులు మా దృష్టికి వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు గాయపడిన 58 పక్షులను స్వాధీనం చేసుకొని చికిత్స అందజేస్తున్నాం’ అని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ సంస్థ (జీహెచ్ఎస్పీసీఏ) కన్వీనర్ సౌధారాం భండారీ. ప్రస్తుతం బేగంబజార్లోని ఆ సంస్థకు చెందిన క్లినిక్లో వాటికి చికిత్సలు అందజేస్తున్నారు. ‘గాయపడ్డ వాటిలో ఎన్ని బతికి బయటపడతాయో తెలియదు. ఇప్పటికే ఒక పక్షి చనిపోయింది. ఏ చిన్న గాయమైనా అవి కోలుకునేందుకు నెల రోజులకు పైగా సమయం పడుతుంద’ని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎస్పీఏతో పాటు పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ (పీఎఫ్ఏ) సంస్థలు సంయుక్తంగా నగరంలో పక్షుల సంరక్షణ చర్యలను కొనసాగిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో మరో 10 గాయపడ్డ పక్షులను గుర్తించి జూపార్కులోని పక్షులు, జంతువుల చికిత్స కేంద్రానికి తరలించారు. గాయపడ్డ వాటిలో పావురాలు, చిలుకలు, డేగలు, కొంగలు, కాకులు తదితర ఉన్నాయి. అశోక్నగర్, కూకట్పల్లి, మెట్టుగూడ, మాసబ్ట్యాంక్, పంజగుట్ట, సంతోష్నగర్, ఎయిర్పోర్టు కాలనీ, లక్డీకాపూల్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఈ పక్షులను గుర్తించారు. మరోవైపు అటవీశాఖ ఈసారి నగరంలోని సుమారు 72 షాపులపై దాడులు నిర్వహించి 250 కిలోలకు పైగా చైనా, నైలాన్ మాంజాను స్వాధీనం చేసుకుంది. గతేడాది 150 గాయపడిన పక్షులను గుర్తించి చికిత్స అందజేసినట్లు జీహెచ్ఎస్పీసీఏ తెలిపింది. మార్పు నామమాత్రమే.... చైనా, నైలాన్ మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్–15 ప్రకారం చైనా మాంజాను విక్రయించినా, కలిగి ఉన్నా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే రూ.లక్ష జరిమానా కూడా విధించవచ్చు. 2016 జనవరి 13న ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో గత రెండేళ్లుగా కొంత మార్పు కనిపిస్తోంది. 30 శాతం వరకు కాటన్ మాంజా వినియోగంలోకి వచ్చినట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. కానీ ఇంకా 70శాతం చైనా మాంజా ముప్పు పొంచి ఉన్నట్లే కదా. ఈ మాంజా దెబ్బకు గాయపడిన పక్షులను కాపాడేందుకు జీహెచ్ఎస్పీసీఏ 24గంటల పాటు అందుబాటులో ఉంటుందని సౌధారాం భండారీ తెలిపారు. నగరంలో ఎక్కడైనా పక్షులకు, జంతువులకు, వన్యప్రాణులకు అపాయం ఉన్నట్లయితే 88867 43881, 85559 55202 నెంబర్లలో తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే అటవీశాఖ కూడా ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 040–23231440 లేదా 18004255364 నెంబర్లకు సమాచారం అందజేయవచ్చు. -
మాంజా..పంజా..
సాక్షి, సిటీబ్యూరో: బైక్పై వేగంగా ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిని చైనా మాంజా రూపంలో ప్రమాదం వెంటాడింది. అయితే సకాలంలో వైద్యసేవలు అందడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్బుల్ కటింగ్ వర్క్ చేసే శామీర్పేట బాలాజీనగర్కు చెందిన అశోక్గుప్తా (33) మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు పని ముగించుకుని బైక్పై జవహర్నగర్ నుంచి ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో గాలికి వేలాడుతున్న ఓ చైనా మాంజా ఆయన మెడకు బలంగా తగిలింది. దీంతో ఆయన గొంతుపై సుమారు పది సెంటిమీటర్ల పొడవు, అర సెంటి మీటరు గాయమై లోతుగా తెగింది. రక్తమోడుతున్న ఆయనను చికిత్స కోసం బంధువులు స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాధమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సచివాలయం సమీపంలోని మాక్స్క్యూర్ ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెనీ విభాగం అధిపతి డాక్టర్ సతీష్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శివరామ్ నేతృత్వం లోని వైద్య బృందం వెంటనే ఆయనను ఆపరేషన్ థియేటర్కు తరలించి గాయానికి కుట్లు వేశారు. రక్తస్త్రావాన్ని నివారించి, ప్రాణాపాయం నుంచి రక్షించారు. అదృష్టవశాత్థు ప్రధాన రక్తనాళాలతో పాటు కీలకమైన శ్వాసనాళాలకు ఎలాంటి గాయం కాకపోవడంతో అశోక్గుప్తాకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. మరో నాలుగైదు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసే అవకాశం ఉందని వైద్యనిపుణులు స్పష్టం చేశారు. సింథటిక్ దారాలకు మెటల్ కోటింగ్ వల్లే.. సంక్రాంతి సెలవుల్లో పిల్లలు, పెద్దలు పతంగులు ఎగరేయడం తెలిసిందే. పతంగులకు సంప్రదాయ కాటన్ దారానికి బదులు తక్కువ ధరకు వచ్చే చైనా మాంజా వాడటం, వాటికి సింథటిక్, గ్లాస్, మెటల్ కోటింగ్ వేయడం వల్ల అవి శరీరానికి తగిలినప్పుడు కోసుకుపోతుంటాయి. ఈ మాంజా కోసుకుపోవడం వల్ల శరీరంపై లోతైన గాయాలు కావడంతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు స్పష్టం చేశారు. -
పావురాలే కాదు... విద్యుత్ వైర్లకూ తప్పని గండం
సాక్షి, సిటీబ్యూరో: చైనా మాంజా కేవలం పావురాలు, ఇతర పక్షులనే కాదు...విద్యుత్ వైర్లను సైతం వదలడం లేదు. పతంగులు విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రేటర్ పరిధిలో ఆదివారం ఒక్క రోజే వంద పీడర్ల పరిధిలో ఇదే కారణంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కందికల్గేట్ సమీపంలోని విద్యుత్ వైర్లకు ఆదివారం ఉదయం చైనామాంజా చిక్కుకుని, షార్ట్సర్క్యూట్ తలెత్తడంతో ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీల్లో దాదాపు గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బంజారాహిల్స్లోని నందినగర్లో డిస్ట్రిబ్యూషన్ లైన్ల మధ్య పతంగి చిక్కడంతో ఇదే సమస్య తలెత్తింది. మూసీ పరివాహాక ప్రాంతంలోని చాదర్ఘాట్, ఇమ్లీబన్ బస్టేషన్, గోల్నాక, అంబర్పేట్, రామంతాపూర్, నాగోల్, నందనవనం, లెనిన్నగర్, పద్మారా వున గర్, సికింద్రాబాద్, వారసిగూడ, తార్నాక, నల్లకుంట, చాంద్రాయణగుట్ట, చిలుకలగూడ, లాలాపేట్, ఉప్పల్ తది తర ప్రాంతాల్లో వెలుగు చూసి న విద్యుత్ సరఫరాలకు ఇదే కారణంగా తేలింది. గట్టిగా కిందకు లాగడంతో... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 10 తేదీ నుంచి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి సెలవుల్లో పిల్లలు ఇంటిపై నిలబడి పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేయడం అందరికీ తెలిసిందే. పిల్లలు ఆనందంతో ఎగరేసే పతంగుల్లో చాలా వరకు వైర్ల మధ్య చిక్కుకుంటున్నాయి. చైనా మాంజాతో పతంగ్లు తయారు చేయడం, వైర్ల మధ్య చిక్కుకున్న పతంగ్లను విడిపించుకునేందుకు పిల్లలు వాటిని గట్టిగా కిందికి లాగుతుంటారు. ఇలా లాగే క్రమంలో అప్పటి వరకు దూరంగా ఉన్న వైర్లు ఒకదానికొకటి ఆనుకుని, విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగుతున్నాయి. వైర్ల మధ్య రాపిడి కారణంగా హైఓల్టేజ్ సమస్య తలెత్తి..ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సమీపంలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఫీజులు కాలిపోతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. డిమాండ్కు తగినంత సరఫరా ఉన్నప్పటికీ...మాంజా వల్ల తరచూ కరెంట్ సరఫరా నిలిచిపోతుండటంతో ఏం చేయాలో తెలియక ఇంజినీర్లు తలపట్టుకుంటున్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలతో పోలిస్తే...ఇరుకైన వీధులు ఎక్కువగా ఉండే మురికివాడలు, ఇతర బస్తీల్లోనే ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతోందని బంజారాహిల్స్ ఎస్ఈ ఆనంద్ పేర్కొన్నారు. లైన్ల కింద పతంగులు ఎగరెయొద్దుః విద్యుత్లైన్ల కింద పతంగులు ఎగరేయడం వల్ల మాంజా వైర్లకు చుట్టుకుని పిల్లలు విద్యుత్షాక్కు గురయ్యే ప్రమాదం ఉంది. చెట్ల కొమ్మల మధ్య, విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకున్న వాటిని తీసేందుకు యత్నించడం కంటే..వాటిని అలాగే వదిలేయడం ఉత్తమం. వైర్లకు చుట్టుకుపోయిన చైనామాంజాను గట్టిగా లాగే సమయంలో ఒకదానికొక వైరు ఆనుకుని..మంటలు ఎగిసిపడే అవకాశం ఉంది. లైన్లకింద ఆడుకుంటున్న పిల్లలపై ఈ నిప్పులు కురవడంతో వారు గాయపడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు పిల్లలు లైన్ల కిందకాకుండా ఖాళీగా ఉన్న క్రీడామైదానాల్లో పతంగులు ఎగరేసుకోవాలి. ఎవరికి వారుగా కాకుండా సమూహంగా పతంగులు ఎగరేయడంద్వారా పిల్లల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. ఇం టిపై నిలబడి పతంగులు ఎగరేయడం కన్నా ..ఖాళీ మైదానంలో నిలబడి పతంగ్లు ఎగరేయ డం ద్వారా ఎక్కువ ఆనందం ఉంటుంది.–ఏజీ రమణప్రసాద్,ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఆఫ్ తెలంగాణ -
డేంజర్ మాంజాపై టాస్క్ఫోర్స్ పంజా
సాక్షి, సిటీబ్యూరో: పతంగుల పండుగగా పిలిచే సంక్రాంతి నేపథ్యంలో నగరంలో మాంజా విక్రయాలు జోరందుకుంటాయి. నిషేధం ఉన్నప్పటికీ లాభార్జనే ధ్యేయంగా పలువురు వ్యాపారులు గాజు రజను పూతతో కూడిన సింథటిక్ మాంజా అమ్ముతుంటారు. దీని ప్రభావాన్ని వివరిస్తూ ‘సాక్షి’ శుక్రవారం ‘డేంజర్ మాంజా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సిటీలో ఈ తరహా మాంజా విక్రయాలపై నిఘా వేయాల్సిందిగా డీసీపీ పి.రాధాకిషన్రావు ఆదేశాలు జారీ చేశారు. రసూల్పుర ప్రాంతంలో దాడులు చేపట్టిన వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిషేధిత మాంజా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని భారీగా సరుకు స్వాధీనం చేసుకున్నారు. రసూల్పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్బర్ అలీ స్థానికంగా ఏకే ట్రేడర్స్ పేరుతో డిస్పోజబుల్ సామాన్లు విక్రయిస్తుంటాడు. ఇతడితో పాటు అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజఫర్ అలీ సైతం సంక్రాంతి నేపథ్యంలో పతంగుల విక్రయ దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఇటీవలే వేర్వేరుగా దుకాణాలు తెరిచిన ఈ ద్వయం వివిధ రకాలైన గాలిపటాలతో పాటు మాంజాలు అమ్మడం మొదలెట్టారు. చైనా మాంజా, సింథటిక్–గాజు మిశ్రమాలతో కూడిన మాంజాలు అత్యంత ప్రమాదకరమని, వీటిపై నిషేధం ఉందని తెలిసినప్పటికీ వీరిద్దరూ ఎక్కువ లాభాలు ఉన్నాయనే ఉద్దేశంతో వాటినే అమ్ముతున్నారు. దీనిని గుర్తించిన ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్రెడ్డి, ఎల్.భాస్కర్రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.6 లక్షల విలువైన నిషేధిత మాంజా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులకు అప్పగించారు. ఇలాంటి మాంజాలతో పతంగులు ఎగురవేస్తే అవి తెగినప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని టాస్క్ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. చెట్లు తదితరాలకు వేలాడుతున్న, ఎక్కడైనా పట్టుకున్న వీటిలో పక్షులు చిక్కుకుని చనిపోతాయి. అనేక సందర్భాల్లో ప్రజలూ తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సీజన్ ముగిసే వరకు ఇలాంటి విక్రయాలపై డేగకన్ను వేసి ఉంచుతామని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఎవరైనా విక్రయిస్తుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చైనా మాంజా తయారీ నిషేధం
అమ్మినా,కొన్నా శిక్షార్హులు: అడిషనల్ పీసీసీఎఫ్ భాంజా సాక్షి, హైదరాబాద్: పతంగులను ఎగురవేసేందుకు ఉపయోగించే చైనా మాంజా (నైలాన్ దారం, గాజుముక్కల పొడితో తయారు చేసిన దారం)ను నిషేధించినందున, దీనిని తయారు చేసినా, విక్రయించినా, కొనుక్కున్నా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు అటవీ ముఖ్య సంరక్షణాధికారి (అడిషనల్ పీసీసీఎఫ్) మనోరంజన్ భాంజా హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 ప్రకారం చైనా మాంజాను ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా నిషేధించినట్లు చెప్పారు దీనిలో భాగంగా ఈ మాంజా తయారీ, విక్రయం, కొనుగోలు చేసేవారికి అయిదేళ్ల జైలుశిక్ష లేదా రూ.లక్ష జరిమానాతో పాటు ఈ రెండింటినీ విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బుధవారంఅరణ్యభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చైనా మాంజా వల్ల పశు పక్ష్యాదులు, మనుషులకే కాక పర్యావరణానికి కూడా హాని కలుగుతున్నందున దీనిని ఉపయోగించకుండా అటవీ శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. నిషేధాన్ని ఈ సంక్రాంతి పండగ సందర్భంగా 2017లో దీనిని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. ప్రజలు ఎక్కడైనా చైనా మాంజా ఉపయోగాన్ని గమనిస్తే టోల్ఫ్రీ నెంబర్ 1800–4255364కు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. -
చైనా మాంజానా.. మజాకా!
దేశ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన పతంగులు ఎగరేయడానికి ఉపయోగించిన 'చైనా మాంజా' కారణంగా ఢిల్లీలో ముగ్గురు మరణించడంతో ఆ మర్నాడే ఢిల్లీ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. గత రెండేళ్లలోనే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఈ మాంజా కారణంగా 15 మందితో పాటు వందలాది పక్షులు మరణించాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు చైనా మాంజాపై నిషేధం విధించాయి. ఇప్పుడు డిల్లీ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. 1986 నాటి పర్యావరణ పరిరక్షిణ చట్టం కింద వివిధ రాష్ట్రాలు గుడ్డిగా చైనా మాంజాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశాయని చెప్పవచ్చు. ఎందుకంటే చైనా మాంజా అంటే ఏమిటీ, దాన్ని నిజంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారా? దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, మాంజా తయారీకి పాటించాల్సిన ప్రమాణాలు ఏమిటీ? ఎలాంటి మాంజాలను నిషేధించాలి? నిషేధాన్ని ఎలా అమలు చేయాలన్న అంశాల జోలికి వెళ్లకుండానే పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్డిగా నిషేధ ఉత్తర్వులు జారీ చేశాయి. దాంతో నిషేధిత రాష్ట్రంలో కూడా ఇప్పటికీ చైనా మాంజా మార్కెట్లో లభిస్తోంది. 'చైనా మాంజా అనగానే సాధారణంగా అందరూ చైనా నుంచి దిగుమతి చేసుకున్న మాంజా అని పొరపాటు పడతారు. ప్రభుత్వాలు కూడా అదే భావంతో ఉన్నట్లు ఉన్నాయి. వాస్తవానికి చైనా, తైవాన్ల నుంచి దిగుమతి చేసుకొనే గ్లాస్ కోటెడ్ పాలిమర్ లేదా పోలిప్రోపిలిన్ ఉపయోగించి స్థానికంగానే ఈ మాంజాను ఉత్పత్తి చేస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్నదని అనుకోవాలనే ఉద్దేశంతోనే దానికి ఆ పేరు పెట్టారు. ఇది ఒట్టి మార్కెటింగ్ జిమ్మిక్కు మాత్రమే' అని బెంగుళూరుకు చెందిన మాంజా ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి, అమ్మకాల విభాగం అధిపతి మోహిత్ కార్తికేయన్ మీడియాకు తెలిపారు. బెంగళూరుతోపాటు సోనెపట్, నోయిడాల్లో ఈ మాంజాను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారని పాత ఢిల్లీకి చెందిన చేతి పతంగి ఉత్పత్తిదారుల సంఘం ఉపాధ్యక్షడు సచిత్ గుప్తా తెలిపారు. కాటన్ దారం మాంజా కన్నా పదునెక్కువగా ఉండటమే కాకుండా తక్కువ ధరకు కూడా దొరుకుతుండటంతో చైనా మాంజాకు డిమాండ్ పెరిగిందని ఆయన చెప్పారు. ఈ మాంజా కోసం చైనా నుంచి కనీసం దారం కూడా దిగుమతి చేసుకోరని, దిగుమతి చేసుకున్న సింథటిక్ పాలిమర్తో దీన్ని స్థానికంగానే తయారు చేస్తున్నారని ఆయన వివరించారు. చైనా మాంజాపై నిషేధం విధించిన ప్రభుత్వాలు మాంజాల ఉత్పత్తికి పాటించాల్సిన ప్రమాణాలను సూచించాలని, అంతవరకు నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, చైనా మాంజానే మళ్లీ పేరు మార్చుకొని మార్కెట్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని కార్తికేయన్ చెప్పారు. మనుషుల మరణాల విషయానికొస్తే కాటన్ మాంజాల వల్ల కూడా ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు. గుజరాత్ ప్రభుత్వం 2009 నవంబర్లో, మహారాష్ట్ర 2015లో, ఆంధ్రప్రదేశ్ 2016 మేనెలలో, కర్ణాటక ప్రభుత్వం 2016 జూలై నెలలో చైనా మాంజాపై నిషేధం విధించగా, ఇప్పుడు వాటి సరసన ఢిల్లీ ప్రభుత్వం చేరింది.


